వంద రోజులు: ఇండియాలో 14.19 మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో ఇప్పటివరకు 14.19 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 14.19 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఏప్రిల్ 25వ తేదీకి 100 రోజులు పూర్తైంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించారు. ఇప్పటివరకు 20,44,954 సెషన్స్ లో 14,19,11,233 మందికి టీకా అందించారు.
మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో 58.78 శాతం కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రాల్లో జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.దేశంలోని మొత్తం నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
దేశంలో ఈ ఏడాది మే 1వ తేదీ నుండి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్రం. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు కోవిన్ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.