వరదలతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అతలాకుతలం: రంగంలోకి నేవీ బృందాలు
మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలలో పెద్ద సంఖ్యలో నావికా దళాలను మోహరించినట్లు కేంద్రం తెలిపింది. వరదనీటితో పలు నదులు, జలాశయాలు పొంగి ప్రవహిస్తుండంతో లోతట్టుప్రాంతాలు, తీరప్రాంతాల ప్రజలను సహాయక బృందాలు కాపాడుతున్నాయి.
భారీవర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో సహాయ పునరావాస పనులు నావికాదళాలు చేపట్టనున్నాయి. వరద పీడిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలలో పెద్ద సంఖ్యలో నావికా దళాలను మోహరించినట్లు కేంద్రం తెలిపింది. వరదనీటితో పలు నదులు, జలాశయాలు పొంగి ప్రవహిస్తుండంతో లోతట్టుప్రాంతాలు, తీరప్రాంతాల ప్రజలను సహాయక బృందాలు కాపాడుతున్నాయి. ఏడు నావికాదళం వరద సహాయక బృందాలు ముంబై నుంచి రత్నగిరి, రాయిగడ్ జిల్లాలకు తరలివెళ్లాయి. అలాగే రాయిగడ్ జిల్లా పొలాద్ పూర్ ప్రాంతంలో హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
Also Read:రాయ్ఘడ్లో విరిగిపడిన కొండచరియలు: 32 మంది మృతి
అటు ఉత్తర కన్నడ జిల్లాలోని కద్రా డ్యాం, మల్లాపూర్ కుర్నిపేట, కైగా ప్రాంతాలు జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు లైఫ్ జాకెట్లు, లైఫ్ బోట్లను రప్పించారు. సహాయ బృందాలు 100 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డోంగ్రీలోని గంగవల్లి నదిలో చిక్కుకున్న 8 మందిని హెలికాప్టరు సాయంతో కాపాడారు.