చైనాలో భారత విద్యార్థి మృతి.. మృతదేహాన్ని వెనక్కి తేవాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
చైనాలో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థి మరణించాడు. డిసెంబర్ 11న చైనాకు వెళ్లిన ఆయన అనారోగ్యం బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి సహకరించాలని కుటుంబం తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవం ఆడుతున్న చైనాలో భారత విద్యార్థి మృతి చెందాడు. గత ఐదేళ్లుగా చైనాలో మెడిసిన్ చదువుతున్న తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి అబ్దుల్ షేక్ అనారోగ్యంతో మరణించాడు. ఆర్థికంగా వెనుకబడిన అతని కుటుంబం డెడ్బాడీని వెనక్కి తీసుకురావడానికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది.
మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తూనే అబ్దుల్ షేక్ చైనాలో ఇంటర్న్షిప్ చేశాడు. ఆయన ఇటీవలే ఇండియాకు వచ్చాడు. మళ్లీ డిసెంబర్ 11వ తేదీన చైనాకు తిరిగి వెళ్లిపోయాడు. చైనాకు చేరిన తర్వాత 8 రోజుల తప్పనిసరి ఐసొలేషన్ను కూడా పూర్తి చేసుకున్నాడు. చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో అబ్దుల్ షేక్ ఇంటర్న్షిప్ చేశాడు.
చైనాకు వెళ్లిన తర్వాత అబ్దుల్ షేక్ అనారోగ్యానికి గురయ్యాడు. అది తీవ్రరూపం దాల్చింది. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. చివరకు ఆయన ఐసీయూలోనే ప్రాణాలు వదిలాడు.
Also Read: ఓ వైపు కోవిడ్ ఉధృతి.. మరో వైపు న్యూయర్ సెలబ్రేషన్.. వుహాన్ లో వేల సంఖ్యలో గుమిగూడిన ప్రజలు
అబ్దుల్ షేక్ మృతదేహాన్ని స్వదేశానికి తేవడానికి అతని కుటుంబం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయాన్ని కోరింది. అలాగే, తమిళనాడు ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలని అప్పీల్ చేసింది.