దుబాయి వెళ్లిన భారతీయుడు అదృశ్యం
అమృతలింగం ఇంటికి కూడా ఫోను చేయకపోవడంతో.. రూంలో ఉన్న ముగ్గురికి అమృతలింగం ఇంటి నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి.
టూరిస్ట్ వీసాపై దుబాయి వెళ్లిన ఓ భారతీయుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం సదరు వ్యక్తి బంధువులు ఇండియన్ కాన్సులేట్ ను సంప్రదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అమృతలింగం సమయముత్తు(46) ఉద్యోగం కోసం మరో నలుగురితో కలిసి నవంబర్ ఎనిమిదో తేదీన దుబాయి వచ్చాడు. హోర్ అల్ ఆంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో నలుగురు బస చేశారు.
మరుసటి రోజు ఉదయం అమృతలింగం ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాగా.. మిగతా ముగ్గురు నైట్ షిఫ్ట్కు వెళ్లారు. వారు ముగ్గురు రూంకు తిరిగి వచ్చేసరికి అమృతలింగం అదృశ్యమయ్యాడు. అమృతలింగం ఇంటికి కూడా ఫోను చేయకపోవడంతో.. రూంలో ఉన్న ముగ్గురికి అమృతలింగం ఇంటి నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి.
రూంలోని ఓ వ్యక్తి బంధువు దుబాయిలోనే నివసిస్తుండటంతో.. అతడి ద్వారా నవంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అమృతలింగం పనిచేస్తున్న కంపెనీకి వెళ్లగా.. అతడి పాస్పోర్టు, వస్తువులు అక్కడే వదిలేసి వెళ్లినట్టు తెలిసింది. రెండు వారాలైనా అమృతలింగం ఆచూకీ దొరకకపోవడంతో.. అతడి కుటుంబం ట్విటర్ ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ను సంప్రదించింది.
విషయం తెలుసుకున్న కాన్సులేట్ అధికారులు అమృతలింగంను వెతికే పనిలో పడ్డారు. విజిట్ లేదా టూరిస్ట్ వీసాపై ఉద్యోగం చేసేందుకు దుబాయి రావొద్దంటూ కాన్సులేట్ ఈ సందర్భంగా హెచ్చరించింది. దుబాయిలో ఉద్యోగం చేయాలంటే దానికి తగిన వీసాతో మాత్రమే దేశంలోకి రావాల్సి ఉంటుందని, విజిట్ లేదా టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయడం నేరమని తెలిపింది.