ఆర్మీ బలగాలకు ఆర్థిక అధికారాలు.. సత్వర నిర్ణయాలకు వీలు
భారత ఆర్మీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయధాల కొనుగోలులో జాప్యానికి చెక్ పెడుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రతా బలగాలకు ఆర్థికపరమైన అధికారులు కల్పిస్తూ వేగంగా ఆయుధాలు, సేవలు సమకూర్చుకోవడానికి వీలు కల్పించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరత, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు సాగుతున్న తరుణంలో ఆర్మీ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆర్మీకి ఆర్థిక అధికారులు ఇస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో రెవెన్యూ ప్రొక్యూర్మెంట్ అధికారాలు ఆర్మీకి లభిస్తాయి. తద్వారా ఆయుధాలు, ఇతర సేవలను ఆర్మీ స్వయంగా సమకూర్చుకోగలుగుతుంది. డెలెగేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్ టు డిఫెన్స్ సర్వీసెస్(డీఎఫ్పీడీఎస్) 2021తో ఫీల్డ్ ఫార్మేషన్లో సాధికారతతోపాటు వ్యవస్థాగతంగా సంసిద్ధతపై ఫోకస్ పెట్టడానికి వీలుచిక్కుతుంది.
ఆర్మీ అన్ని స్థాయిల్లో నిర్ణయాలను సత్వరంగా తీసుకోవడానికే ఈ నిర్ణయం ఉపకరిస్తుందని కేంద్రం ఆదేశాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో వేగంగా ప్రణాళికలు చేపట్టడమే కాదు, నిర్వహణపరమైన సన్నద్ధతకు, వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తాయని పేర్కొన్నాయి.
వైస్ చీఫ్లకు ఉన్న ఆర్థిక అధికారాలను పదిశాతం పెంచినట్టు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తంగా రూ. 500 కోట్లకు పరిమితిని పెంచినట్టయింది.