అరుణాచల్ ప్రదేశ్ లో కూలిన ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్.. పైలెట్ మృతి..
అరుణాచల్ ప్రదేశ్ లో విషాదం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక పైలెట్ చనిపోయారు. మరో పైలెట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో బుధవారం భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తవాంగ్లోని ఫార్వర్డ్ ఏరియాల వెంట రొటీన్ మిషన్లో హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్ లు ఉన్నారు.
2జీ స్కామ్: సీబీఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు.. రాజానే 'మాస్టర్ మైండ్'
ప్రమాద సమాచారం తెలసుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. పైలట్లను సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక పైలెట్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. రెండో పైలట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘‘ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది, పైలట్ చనిపోయాడు’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
మరణించిన పైలట్ ఎవరనేది ఇంకా ఇండియన్ ఆర్మీ అధికారికంగా తెలియజేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లుంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటీకే వాటర్ఫాల్స్ సమీపంలో చాపర్ కూలిపోయిందని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనతో తెలిపింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదని పేర్కొంది. వివరాలు అందుతున్నాయని తెలిపింది.
ఈ ఘటన పై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించారు. ‘‘ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లా నుండి ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్ అయినట్టు వార్త వస్తోంది. పైలట్లు ప్రాణాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారు ’’ అని ఆయన ట్వీట్ చేశారు.