భారత అమ్ముల పొదిలో నాగాస్త్రం: 'నాగ్ 'క్షిపణి ప్రయోగం సక్సెస్
పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి 'నాగ్' తుది దశ ప్రయోగాలను డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది.
జైపూర్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి 'నాగ్' తుది దశ ప్రయోగాలను డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ లో గురువారం నాడు ఉదయం 6: 45 గంటలకు నాగ్ క్షిపణి నిర్ధేశిత లక్ష్యాలను కచ్చితంగా చేధించిందని డీఆర్డీఓ ప్రకటించింది.
ఈ క్షిపణిని నామినా నుండి ప్రయోగించారు. నిర్ధేశిత లక్ష్యాన్ని చేధించి డమ్మీ ట్యాంక్ కవచాన్ని తొలగించినట్టుగా అధికారులు తెలిపారు.
నాగ్ క్షిపణి నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రైనా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు.ఈ క్షిపణి క్యారియర్ ను రష్యాకు చెందిన బీఎంపీ-2 టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఈ తరహా టెక్నాలజీని లాక్ బిఫోర్ లాంచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ క్షిపణి తుది దశ ప్రయోగాలు చేశారు.తుది దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకొందని డీఆర్డీఓ చైర్మెన్ సతీష్ రెడ్డి తెలిపారు.
ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు గాను డీఆర్డీఓ, ఆర్మీని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.