భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, శాంతివైపే నిలబడుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నించారని తెలిపారు. ఇరు దేశాల అధ్యక్షులతో పలుమార్లు మాట్లాడారని చెప్పారు. 

జాతీయ ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలోనే భారతదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు ఉంటాయ‌ని కేంద్ర విదేశాంగ‌ మంత్రి ఎస్ జై శంక‌ర్ అన్నారు. అంతర్జాతీయ క్ర‌మంలో వాటి ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించాల‌నే అనే నమ్మకంతో ప‌ని చేస్తున్నామ‌ని తెలిపారు. భార‌త్ ఎప్పుడూ శాంతి కోసం నిలబడాలని పిలుపునిస్తుందని తెలిపారు. గురువారం ఆయ‌న రాజ‌సభ‌లో మాట్లాడారు. ప‌లువురు సభ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. 

“ మ‌నం సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయ క్రమం తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే నమ్మకంతో మ‌న విధానం చాలా మార్గనిర్దేశం చేయబడింది ’’ అని రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఎస్ జై శంక‌ర్ రాజ్యసభలో అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌లతో సంబంధం ఉన్న పరిస్థితి మ‌న స‌మ‌స్య కాద‌ని భార‌త్ ఎప్పుడూ అనుకోద‌ని అన్నారు. మ‌నం శాంతి కోసం ఉన్నామ‌ని అదే మ‌న స్థానం అని తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగిందని జై శంకర్ రాజ్యస‌భ‌లో రాత‌పూర్వ‌కంగా తెలిపారు. 

కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన రాత‌పూర్వ‌క స‌మాధానంలో ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం స్థానం దృఢంగా, స్థిరంగా ఉందని నొక్కి చెప్పింది. ఉక్రెయిన్ విష‌యంలో భారతదేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. హింసను తక్షణమే నిలిపివేయాలని.. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చింది.

రష్యా దండయాత్ర, భారత్-అమెరికా వాణిజ్యంపై ప్రభావంపై జై శంక‌ర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ పరిస్థితిని వాణిజ్య స‌మ‌స్య‌ల‌తో ముడిపెట్టే ప్రశ్నే లేదని తెలిపారు. ‘‘ ఉక్రెయిన్‌పై మన స్టాండ్ కు సంబంధించి ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది ఆరు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒక‌టి హింసను, అన్ని శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని మ‌నం సూచిస్తాం. శాంతి కోసం నిలబడతాం. రెండోది దౌత్య మార్గానికి తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదని న‌మ్మ‌డం. అంతర్జాతీయ చట్టం, UN చార్టర్‌లు, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన గౌరవం. నాలుగోది.. సంఘర్షణ పరిస్థితికి మానవతా ప్రాప్తి కోసం పిలుపునిస్తాం. ఐదు.. మనమే మానవతా సహాయం అందిస్తాము. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు 90 టన్నుల మానవతా సహాయం అందించాము. ఇంకా మరిన్ని అందించాల‌ని, ఇందులో ముఖ్యంగా మందులు అందించాలని చూస్తున్నాం. ఆరోది మేము ఈ విషయంపై రష్యన్ ఫెడరేషన్, ఉక్రెయిన్ రెండు దేశాల‌తో ట‌చ్ లో ఉన్నాం.” అని జైశంకర్ చెప్పారు.

ర‌ష్యాకు, ఉక్రెయిన్ కు యుద్ధం ప్రారంభ‌మైన నాటి నుంచి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండుసార్లు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మూడుసార్లు మాట్లాడారని జై శంక‌ర్ తెలిపారు. ర‌ష్యా, చైనా ఇత‌ర అన్ని దేశాల‌కు, అంత‌ర్జాతీయ క్ర‌మంలో జ‌రుగుతున్న అన్ని మార్పులు భార‌త్ కు తెలుస‌ని చెప్పారు. భార‌త్ కు దిగుమ‌తి అవుతున్న ముడి చ‌మురులో ర‌ష్యా నుంచి ఒక్క శాతం కంటే త‌క్కువే దిగుమ‌తి అవుతోంద‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా జై శంక‌ర్ తెలిపారు.