దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదు కాగా, మరో పది రాష్ట్రాల్లోనూ పెరుగుదల కొనసాగుతోంది.

దేశంలో మళ్లీ కోవిడ్‌-19 కేసుల పెరుగుదల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మే 30 నాటికి దేశవ్యాప్తంగా 2,710 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం నాలుగు రోజుల్లోనే కేసులు రెండింతలు కావడాన్ని సూచిస్తుంది. మే 26న 1,010 కేసులుండగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కు చేరింది.

ఇందులో అత్యధికంగా కేసులు కేరళలో నమోదు అయ్యాయి. రాష్ట్రానికి చెందిన 1,147 మంది ప్రస్తుతం కోవిడ్‌కి చికిత్స పొందుతున్నారు. కేరళ తర్వాత మహారాష్ట్ర (424 కేసులు), దిల్లీ (294), గుజరాత్‌ (223), తమిళనాడు (148), కర్ణాటక (148) రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 116, రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, పుదుచ్చేరి లో 25, హరియాణాలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7 కేసులు ఉన్నాయి. అలాగే ఒడిశా, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లలో ఒక్కో నాలుగు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌ రాష్ట్రాల్లో మూడేసి కేసులు ఉండగా, మిజోరం, అస్సాం రాష్ట్రాల్లో ఒక్కోరు కోవిడ్‌ బారిన పడ్డారు.

ఈ కేసుల పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్‌గా తీసుకుంటోంది. అయితే ప్రజలు అధికంగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కొత్త వేరియంట్లు చాలా వరకు తక్కువ ప్రభావంతో ఉండే అవకాశముందని, కానీ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు కడగడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రాష్ట్రాల మధ్య అసమానంగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి సమన్వయం జరిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లో నిర్ధారిత కేసులపై దృష్టి పెట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.