NB.1.8.1 వేరియంట్ చైనా, హాంకాంగ్‌లో కేసులు పెంచింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నా, తీవ్రత తక్కువగా ఉంది.

కొవిడ్ వైరస్ మళ్లీ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన NB.1.8.1 అనే కొత్త సబ్ వేరియంట్ ఈసారి ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అమెరికా, చైనా, హాంకాంగ్‌లలో వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ తీవ్రత అంతగా లేకపోయినా, దాని వేగవంతమైన వ్యాప్తి రేటు కారణంగా ఆసుపత్రుల్లో చేరే రేటు ను పెంచుతోంది.

NB.1.8.1 వేరియంట్ మొదటగా 2025 మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటివారంలో అమెరికాలోని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణికులలో  గుర్తించారు. అనంతరం ఒహియో, రోడ్ ఐలాండ్, హవాయిలలో కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మాత్రం ఇది ఏప్రిల్‌లో తమిళనాడులో మొదటిసారి కనిపించింది.

నాలుగు వారాల్లో 81 మంది…

ఆసియాలో ఈ వేరియంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హాంకాంగ్‌లో నాలుగు వారాల్లో 81 మంది తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురవ్వగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడినవారు. ఇదే సమయంలో చైనాలో ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

రిస్క్ పెరుగుతుంది…

NB.1.8.1 వల్ల వచ్చే లక్షణాలు ఎక్కువగా మునుపటి ఒమిక్రాన్ వేరియంట్‌లలాగే ఉన్నాయి. వీటిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, అలసట, ముక్కు కారడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటివి కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కానీ వృద్ధులు, రోగనిరోధక శక్తి తగ్గినవారిలో రిస్క్ పెరుగుతుంది.

ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ NB.1.8.1 గురించి పెద్దగా హెచ్చరికలు జారీ చేయకపోయినా, వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువ తేలికపాటి శ్వాసకోశ సమస్యలతోనే ఉన్నాయి. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ కడగడం, రద్దీ ప్రదేశాలకి దూరంగా ఉండడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరు వద్ద పరీక్ష చేయించుకోవడం అవసరమన్నారు.

NB.1.8.1 తీవ్రత పెద్దగా లేకపోయినా, దాని వేగవంతమైన వ్యాప్తి కరోనా సంక్షోభాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. కాబట్టి, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.