గుడ్ న్యూస్ : 25 రోజుల తరువాత 3 లక్షలకు దిగువకు కొత్త కేసులు..కానీ..
దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకూ తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య భారీగానే ఉంటోంది.
దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకూ తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య భారీగానే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఇక వరుసగా నాలుగో రోజు కొత్త కేసులు తగ్గాయి.
3 లక్షల దిగువన నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. ఆదివారం 15,73,515 మందికి కోవిడ్ నిర్తారణ పరీక్షలు నిర్వహించగా.. 2,81,386 మందికి పాజిటివ్ గా తేలింది.
ఏప్రిల్ 20న 2.95 లక్షల మందికి కరోనా నిర్థారణ కాగా.. ఈ తర్వాత 3 లక్షలకు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజే 4,106మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2.49 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు 2,74,390 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.
వరుసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం క్రియాశీల కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం 35,16,997 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం గమనార్హం. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెరిగాయి. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్ ను జయించారు.
అయితే నిన్న నిర్థారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. మరోవైపు దేశంలో నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడం లేదు. ఆదివారం కేవలం 6,91,211 మందికి మాత్రమే టీకాలు అందించారు. మొత్తంగా ప్రభుత్వం 18,29 కోట్ల డోసులను పంపిణీ చేసింది.