Russia Ukraine Crisis: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరప్ దేశాల తీరుపై విమర్శలు గుప్పించారు. ఆసియా దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు నిబంధనలు వల్లెవేసే యూరప్ దేశాలు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు.
India on Ukraine-Russia: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రారంభించి 60 రోజులు దాటుతోంది. ఈ క్రమంలోనే స్పందించిన భారత్.. దౌత్యంతోనే ఉక్రెయిన్-రష్యా సంక్షోభానికి ముగింపు కార్డు పడుతుందని తెలిపింది. మంగళవారం జియో పాలిటిక్స్ అండ్ జియో ఎనకమిక్స్పై రైసినా డైలాగ్ ఏడో సదస్సు మొదలైంది. ఈ సదస్సులో 90 దేశాలకు చెందిన 210 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ సదస్సును ప్రారంభిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరప్ దేశాల తీరుపై విమర్శలు గుప్పించారు. ఆసియా దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు నిబంధనలు వల్లెవేసే యూరప్ దేశాలు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు.
ఆసియా దేశాలు కష్టాల్లో ఉన్న సమయంలో నిబంధనల గురించి మాట్లాడే యూరప్ దేశాలు.. ప్రస్తుతం చేసిందేమిటని జైశంకర్ ప్రశ్నించారు. ఉక్రెయిన్లో సంక్షోభమే ప్రధాన చర్చనీయాంశంగా మారిందని తాము గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభానికి ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సహా అన్ని రకాల ఇంధన ధరలు పెరిగాయని తెలిపారు. అలాగే, నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతూ.. ఆహార ద్రవ్యోల్బణం, వివిధ అంశాల్లో గందరగోళంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వెల్లడించారు. దౌత్యంతోనే ఉక్రెయిన్-రష్యా సంక్షోభానికి ముగింపు కార్డు పడుతుందని తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తప్పనిసరిగా నిలువరించాలంటే దౌత్య మార్గంలోకి వెళ్లి సంప్రదింపులు జరుపడమే పరిష్కార మార్గమని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. దౌత్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దౌత్యం మరియు చర్చలకు తిరిగి రావడానికి మనం ఏదో ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని అన్నారు. దీని కోసం ప్రస్తుతం దేశాల మధ్య పోరాటం ఆపాలని పేర్కొన్నారు. కాగా, ప్రపంచ దేశాల మధ్య యుద్దం జరిగినప్పుడల్లా భారత్.. తటస్థంగా ఉంటూ.. శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలని స్పష్టం చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో కూడా భారత్ తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నది. అయితే, అమెరికా సహా దాని మిత్ర దేశాలు ఈ విషయంలో భారత్ ను హెచ్చరిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు సైతం భారత్ తీరును ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. భారత్ ను ప్రశ్నిస్తున్న దేశాలకు పై విధంగా సమాధానమిచ్చారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం 60 రోజులు దాటింది. రష్యాన్ బలగాలు మరింతగా రెచ్చిపోతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో దేశంలోని అనేక నగరాలు శిథిలాల దిబ్బలా కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పౌరులు ప్రణాలు కోల్పుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి చీఫ్ రెండు దేశాల అధినేతలతో ఈ వారంలో భేటీ కానున్నారు. యద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరపనున్నారు.