కాబూల్ నుంచి ఇండియా బయల్దేరిన చివరి కమర్షియల్ ఫ్లైట్
యుద్ధ వాతావరణం అలుముకున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి భారత చిట్టచివరి కమర్షియల్ ఫ్లైట్ వెనక్కి బయల్దేరింది. 129 మంది ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు రాత్రికల్లా ఇండియా చేరనున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న తరుణంలో ఆ దేశరాజధాని కాబూల్ నుంచి భారత చిట్టచివరి కమర్షియల్ ఫ్లైట్ వెనక్కి బయల్దేరింది. సుమారు 129 మంది ప్రయాణికులతో ఈ ఫ్లైట్ రిటర్న్ అయినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్ఇండియా ఫ్లైట్ ఏఐ-244 ఈ రోజు రాత్రికల్లా భారత్ చేరుకుంటుందని తెలిపాయి.
ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కాబూల్లో సేఫ్గా ల్యాండ్ అయింది. తాలిబన్లు కాబూల్ను నలువైపుల నుంచి దిగ్బంధించిన తరుణంలో అక్కడ ల్యాండింగ్పై కొంత గందరగోళం నెలకొంది. అందుకే ల్యాండింగ్లో కొంత జాప్యం చోటుచేసుకుంది. వారానికి మూడు సార్లు కాబూల్కు వెళ్లే ఈ ఫ్లైట్ భావిప్రణాళికలు అనిశ్చితిలో ఉన్నాయి. తాలిబన్లు పైచేయి సాధించడంతో ఆ దేశానికి విమాన సేవలపై అనుమానాలు అలుముకున్నాయి. ఇప్పటికే యూఏఈకి చెందిన ఫ్లైదుబాయి విమానాల సేవలు సోమవారం నుంచి రద్దయ్యాయి.