భారత్ 1947 నుంచి వడిగా దూసుకుపోతున్నది. ఆర్థికంగా బలోపేతం అవుతున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ పురోగతిని జీడీపీ ఆధారంగా చూద్దాం. స్వాతంత్ర్యం పొందినప్పుడు దేశ జీడీపీ సుమారు 2.8 లక్షల కోట్లుగా ఉండగా.. నేడు అది సుమారు 147 కోట్లకు చేరడం గమనార్హం. 

న్యూఢిల్లీ: భారత దేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నది. అప్పుడు మన దేశాన్ని పేద దేశాల జాబితాలో పేర్కొనేవారు. కానీ, స్వాతంత్ర్యం అనంతరం భారత దేశం ఆర్థికంగా వడిగా ముందడగులు వేసింది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో పంచవర్ష ప్రణాళికలు కీలకమైనవి. ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఈ ప్రణాళికల అమలు భారత దేశానికి ఎంతో కలిసి వచ్చాయి. తొలుత పంట, పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టి మన దేశాన్ని పేదరికం నుంచి స్వయం సమృద్ధ భారత్ వైపు అడుగులు వేయించగలిగింది.

మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారత జీడీపీ చాలా తక్కువగా ఉన్నది. అప్పుడు కేవలం రూ. 2.7 లక్షల కోట్లుగా ఉన్నది. కానీ, నేడు అది 50 రెట్లకు పెరిగింది. ముఖ్యంగా 1991లో ఎల్పీజీ నిర్ణయాలు చేసిన తర్వాత ఈ పెరుగుదల మరింత వేగం అందుకున్నది. నేడు ఈ జీడీపీ రూ. 147 కోట్లకు పెరిగింది. అంటే 50కి మించి సుమారు 54 రెట్ల వరకు జీడీపీ పెరిగింది. 1950-51 కాలంలో భారత జీడీపీ 2,939 బిలియన్ల రూపాయలుగా ఉన్నది. ఇదే 2011-12 సంవత్సరాల కల్లా రూ. 56,330కు పెరగడం గమనార్హం. 

అదే సమయంలో భారత సగటు పౌరుడి ఆదాయాలు కూడా పెరిగాయి. 1950-51 కాలాల్లో భారత సగటు పౌరుడి ఆదాయం రూ. 7,513గా ఉన్నది. ఇది 2011-12 కాలంలో రూ. 41,255కి పెరిగింది. ఇది 2018-19 కాలాని కల్లా రూ. 92,565కి చేరడం గమనార్హం. దేశ జనాభా గణనీయంగా పెరిగినప్పటికీ సగటు పౌరుడి ఆదాయాలు ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో భారత జనాభా ఇంచు మించు 35 కోట్లుగా ఉన్నది. నేడు ఇది 140 కోట్లను దాటి ఉండొచ్చు.

అంతేకాదు, విదేశీ మారకం కూడా భారత్ గణనీయంగా పెంచుకోగలిగింది. విదేశీ మారక నిల్వలు 1950లో రూ. 1,29 కోట్లు ఉండగా.. నేడు అవి సుమారు 50 లక్షల కోట్లకు చేరువవ్వడం గమనార్హం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ భారీగా పెరిగాయి. 1948లో భారత దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు రూ. 256 కోట్లు. కానీ, నేడు ఈ ఎఫ్‌డీఐలు సుమారు 81 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.