ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకు 168 మంది:కొనసాగుతున్న తరలింపు
ఆఫ్ఘనిస్తాన్ నుండి 168 మంది ఇండియాకు తరలించారు. ఇందులో 107 మంది ఇండియన్లు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న 168 మంది ఇండియాకు రప్పించారు. ప్రత్యేక విమానంలో కాబూల్ నుండి ఇండియాకు 168 మందితో కూడిన ప్రత్యేక విమానం ఆదివారం నాడు ఇండియాకు తిరిగి వచ్చింది.
ఇందులో 107 మంది భారతీయులున్నట్టుగా అధికారులు తెలిపారు. మరో 87 మంది భారతీయులు సహా ఇద్దరు నేపాల్ జాతీయులు శనివారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో కాబూల్ నుండి తజకిస్తాన్ రాజధాని దుషాన్ బేకి వెళ్లారు. దుషాన్ బే నుండి వారిని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చినట్టుగా అధికారులు తెలిపారు.
కొన్ని రోజులుగా అమెరికా నాటో విమానాల ద్వారా కాబూల్ నుండి దోహాకు తరలించిన 135 మంది భారతీయుల బృందాన్ని కూడా తిరిగి దేశానికి తిరిగి తీసుకొచ్చారు. కాబూల్ నుండి దోహకు తరలించిన భారతీయులు ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేస్తున్న అనేక విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులని అధికారులు వివరించారు.
కాబూల్ నుండి 107 మంది ఇండియన్లు సహా 168 మంది ప్రయాణీకులతో ఐఎఎఫ్ ప్రత్యేక స్వదేశీ విమానం ఢిల్లీకి వెళ్తోందని భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. ఈ విమానంలో ప్రముఖ సిక్కు నాయకులున్నారని తెలిసింది.
87 మంది భారతీయులను ఎఎల్ 1956 ప్రత్యేక విమానం తజకిస్తాన్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.