భారత్-చైనా సైనికుల ఘర్షణ: మోడీ బలహీన రాజకీయ నాయకత్వమే.. పార్లమెంటులో వాయిదా తీర్మానం పెడుతాం: ఒవైసీ
New Delhi: "అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత, చైనా సైనికుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ప్రభుత్వం రోజుల తరబడి దీన్ని దాస్తూ దేశాన్ని చీకటిలో ఉంచింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎందుకు తెలియజేయలేదు?.." అని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
India-China border: భారత్-చైనా సైనికుల ఘర్షణకు ప్రధాని నరేంద్ర మోడీ బలహీన రాజకీయ నాయకత్వమే కారణమని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. భారత్-చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ అంశం హాట్ హాట్గా మారింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా జరుగుతుండడంతో ఈ విషయమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత జవాన్లు గాయపడ్డారనే వార్త మీడియాలో వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు మోడీ సర్కార్ను టార్గెట్ చేశాయి. భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరుగుతోందని, ప్రభుత్వం చాలా రోజులుగా ఈ విషయాన్ని చెప్పకుండా చీకటిలో ఉంచిందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. "అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత, చైనా సైనికుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ప్రభుత్వం రోజుల తరబడి దేశాన్ని చీకటిలో ఉంచింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎందుకు తెలియజేయలేదు?.." అని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
మరో ట్వీట్లో ఒవైసీ, "ఏ సమయంలోనైనా చైనీయులకు తగిన సమాధానం ఇవ్వగల సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది. మోడీ నాయకత్వంలోని బలహీనమైన రాజకీయ నాయకత్వమే చైనాకు వ్యతిరేకంగా ఈ అవమానానికి దారితీసింది. దీనిపై పార్లమెంటులో అత్యవసర చర్చ జరగాలి. ఈ అంశంపై రేపు వాయిదా తీర్మానం ఇస్తాను' అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా ఉన్నాయని, మరో ట్వీట్ లో ఈ ఘర్షణకు కారణం ఏమిటని ఓవైసీ ప్రశ్నించారు. కాల్పులు జరిగాయా లేదా గల్వాన్ లాగా ఉన్నాయా? ఎంతమంది సైనికులు గాయపడ్డారు? వారి పరిస్థితి ఏమిటి? చైనాకు బలమైన సందేశం పంపడానికి పార్లమెంటు సైనికులకు తమ ప్రజా మద్దతును ఎందుకు ఇవ్వకూడదు? అని ఒవైసీ ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.