India Bloc: మళ్లీ ఇండియా కూటమి హడావిడి.. 19న ఢిల్లీలో భేటీ, సీటు షేరింగ్పై డిస్కషన్!
ఇండియా కూటమి హడావిడి మళ్లీ మొదలైంది. ఈ కూటమి నాలుగో భేటీ ఢిల్లీలో డిసెంబర్ 19వ తేదీన జరగనున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది.
![India alliance fourth meeting on december 19th in delhi, congress leader jairam ramesh announces kms India alliance fourth meeting on december 19th in delhi, congress leader jairam ramesh announces kms](https://static-ai.asianetnews.com/images/01h5e4v7sdh3s7phj97trefbgm/Jairam-Ramesh-1689470738221_363x203xt.jpg)
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయెన్స్ (ఇండియా) కూటమి అటకెక్కింది. ఎన్నికలు ముగిసే వరకు సమావేశం లేదు. చర్చా లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి మిత్ర పక్షాలకూ సీట్లను కేటాయించిందీ లేదు. మళ్లీ ఇప్పుడు సన్నగా కూటమి రాగాన్ని కాంగ్రెస్ మళ్లీ అందుకుంది.
డిసెంబర్ 19వ తేదీన ఇండియా కూటమి మరోసారి సమావేశం కాబోతున్నట్టు వెల్లడించింది. ఈ సమావేశంలో సీట్ల పంపకాలు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ తెలిపారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం మంగళవారం, డిసెంబర్ 19వ తేదీన జరుగుతుందని వివరించారు. ఢిల్లీలోనే మధ్యాహ్నం 3.00 గంటలకు ఈ సమావేశం ఉంటుందని చెప్పారు.
ఇండియా కూటమి నేతలు ఇటీవలే ఓ సారి డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నాలుగో సమావేశంలో సీట్ల పంపకాలు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై చర్చిస్తారని వివరించాయి. పార్లమెంటులో డీఎంకే ఎంపీ ఎస్ సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యపై స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ నిరసించిందని పేర్కొన్నాయి. దానిపై తమ వైఖరిని వెల్లడిస్తూ ఓ స్టేట్మెంట్ విడుదల చేయనున్నామని తెలిపాయి.
Also Read: Jagga Reddy: నేను ఓడినా.. పిలవాల్సిందే.. అధికారులకు జగ్గారెడ్డి ఆర్డర్
మేం కూటమిలో ఉన్నాం. కూటమి ధర్మం మిగిలిన అందరికీ బాధ్యత వహించడం లేదా వారితో విభేదాలకు దిగడం కాదు అని ఆ కాంగ్రెస్ వర్గాలు వివరించాయి.
ఇండియా కూటమి కోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎక్కువగా శ్రమించారు. తొలి సమావేశం బిహార్ రాజధాని పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగళూరులో, మూడో సమావేశం ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం, కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశాయి. ఇప్పుడు మళ్లీ నాలుగో సమావేశం కాబోతున్నది. ఈ సమావేశం ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.