రోజువారీ కూలీకి షాక్..! రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలంటూ ఐటీ నోటీస్
బీహార్లోని ఖగారియా జిల్లాలో నివసిస్తున్న ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను చెల్లించాలని పేర్కొంది.
బీహార్లోని ఖగారియా జిల్లాలో నివసిస్తున్న ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ షాక్ ఇచ్చింది. రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీస్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ కూలీ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి..ఫిర్యాదు చేశాడు. 37.5 లక్షల ఆదాయపు పన్ను నోటీసు రావడం సరిగ్గా వర్షం లేని వరదలా ఉందని కార్మికుడు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. గతంలో గిరీష్ ఢిల్లీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలో గిరీష్కు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఆదాయపు పన్ను నోటీసు వచ్చింది. రాజస్థాన్కు చెందిన ఓ కంపెనీతో సంబంధం ఉన్న గిరీష్ రూ. 37.5 లక్షల ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసు చూడగానే గిరీష్కి వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి రావడానికి సరిపోకపోవడంతో గిరీష్ కు దిమ్మ తిరిగింది.
రోజుకు దాదాపు 500 రూపాయలు సంపాదించే గిరీష్ యాదవ్ నోటీసుతో అలౌలి పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలౌలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. గిరీష్ పంచుకున్న సమాచారం ఆధారంగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ప్రాథమికంగా ఇది మోసం కేసుగా కనిపిస్తోందని తెలిపారు.
పాన్ నంబర్ ఆధారంగా కార్మికుడికి నోటీసు
అతని పేరు మీద జారీ చేయబడిన పాన్ నంబర్ ఆధారంగా ఫిర్యాదుదారుడికి నోటీసు వచ్చిందని ఆయన చెప్పారు. గిరీష్ ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్న సమయంలో ఒక బ్రోకర్ ద్వారా పాన్ కార్డు తీసుకున్నాడు. అతడే సంబంధిత కంపెనీకి లింక్ చేసినట్టు అనుమానిస్తున్నారు. నోటీసులో గిరీష్కి రాజస్థాన్లోని ఒక కంపెనీతో సంబంధం ఉందని చెప్పబడింది. కానీ తాను అక్కడికి (రాజస్థాన్) ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. కాగా, ఆ ఐటీ నోటీస్ను పరిశీలించిన పోలీసులు మోసపూరితం కావచ్చని అనుమానించారు. ఫ్రాడ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.