భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత: ధీటుగా బదులివ్వాలని రాజ్నాధ్ ఆదేశం
చైనా ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలపై ఆదివారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ: చైనా ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలపై ఆదివారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తూర్పు లడఖ్ ప్రాంతంలలో చోటు చేసుకొన్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దాడులకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు.
ఎల్ఏసీ వెంటమరింత అప్రమత్తంగా ఉండి చైనా ఆర్మీ దురాక్రమణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
డ్రాగన్ సైన్యం దురాక్రమణలను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చైనా కవ్విస్తే ధీటుగా బదులిచ్చేలా సైన్యాన్ని స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. కాగా గాల్వన్ లోయలో ఎప్పటికప్పుడు పరిస్థితిని భద్రతా దళాలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి.
మరోవైపు గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. ఇదిలావుంటే రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్ కు హాజరు కావడానికి మంత్రి రాజ్నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్ లో పాల్గొంటారు.
ఈ నెల 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా, ఇండియా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు మరణించాడు.