నేను చెప్పిన వ్యక్తిని సర్పంచ్గా గెలిపించకుంటే ఫండ్స్ రానివ్వను: గ్రామస్తులకు బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే బె
బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించకుంటే ఆ ఊరికి ఎలాంటి నిధులు రావని బెదిరించారు. తాను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అని, ఎక్కడి నుంచైనా నిధులు రావాలంటే తనను ముందుగా అడుగుతారని అన్నారు.
ముంబయి: బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి తెర తీశారు. తాను చెప్పిన అభ్యర్థినే సర్పంచ్గా గెలిపించకపోతే ఆ ఊరికి ఎలాంటి ఫండ్స్ రానివ్వనని, తనకు తెలియకుండా ఏ ఫండ్స్ కూడా రాలేవు అని గ్రామ ప్రజలందరినీ ఆయన బెదిరించారు. తాను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అని, అన్ని ఫండ్స్ తన చేతుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలని వార్నింగ్ ఇచ్చారు. నందగావ్లో ఆయన ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఈ విషయంలో నేను స్పష్టంగా ఉంటా. నేను చెప్పిన వ్యక్తినే సర్పంచ్గా గెలిపించిన గ్రామాలకు నా దగ్గర నుంచి ఫండ్స్ వస్తాయి. నేను ఏదీ దాచను. నేను నారాయణ్ రాణే ఆలోచనల నుంచే నేర్చుకున్నవాడిని. పొరపాటున నేను చెప్పిన అతను కాకుండా వేరే వ్యక్తి సర్పంచ్గా గెలిస్తే నా ఫండ్స్ నుంచి ఆ ఊరికి ఒక్క రూపాయి కూడా రాకుండా చూసుకుంటా. ఇది బెదిరింపే అనుకోండి.. ఇంకేమైనా అనుకోండి.. మీ ఇష్టం’ అని ఆయన పేర్కొన్నారు.
‘ఓటు వేసేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. అన్ని ఫండ్స్ నా చేతిలోనే ఉన్నాయి. జిల్లా ప్లానింగ్ ఫండ్స్ లేదా గ్రామీణ అభివృద్ధి నిధులు, లేదా కేంద్ర ప్రభుత్వ నిధులు అయినా సరే. నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేను. సంబంధిత మంత్రి, కలెక్టర్, పర్యవేక్షించే మంత్రి లేదా డిప్యూటీ సీఎం లేదా సీఎం అయినా సరే.. నన్ను అడగకుండా నందగావ్కు నిధులు విడుదల చేయరు. కాబట్టి, ఈ విషయం మీ బుర్రలోకి ఎక్కించుకోండి. నితీశ్ రాణే చెప్పిన వారు గాక వేరే వాళ్లే సర్పంచ్గా ఉంటే నందగావ్ లో అభివృద్ధి అనేది ఉండదు’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నది.