మరికొన్నిరోజుల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా కీలక నగరాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశం వుందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాక్ కేంద్రంగా నడుస్తోన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 10 పేజీల రహస్య నివేదికను పంపింది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఐబీ పేర్కొంది. ఇటీవల ఉదయ్ పూర్, అమరావతి నగరాల్లో జరిగిన దాడుల ఘటనలను ఐబీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు సదా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కీలక నేతల భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. ఢిల్లీలో రోహింగ్యాలు, ఆఫ్ఘన్లు, సూడాన్ దేశాలకు చెందిన వారు నివసిస్తున్న ఏరియాల్లో నిఘా పెట్టాలని ఐబీ పేర్కొంది.
మరోవైపు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 మధ్య తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు. అంతకుముందు ప్రధాని తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్లో మాట్లాడుతూ.. భారతదేశం ఈ సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. ఇది ఎంతో ప్రత్యేకమని పేర్కొంటూ త్రివర్ణ పతాకాన్ని వారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకోవాలని ప్రజలను కోరారు.
ALso REad:ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకం.. అందరూ ఇలానే చేయాలంటూ విజ్ఙప్తి
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ.. భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు. ప్రధానమంత్రిని అనుసరిస్తూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జి, కిషన్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు తమ డీపీలను త్రివర్ణ పతాకానికి మార్చుకున్నారు. "ఈరోజు ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం! మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న తరుణంలో మన దేశం మన త్రివర్ణ పతాకాన్ని జరుపుకునే సామూహిక ఉద్యమం అయిన హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియా పేజీలలో DPని మార్చాను. మీరందరూ అలాగే చేయాలని కోరుతున్నాను" అని ప్రధాని ట్వీట్ చేశారు.
