4.5 జనరేషన్ విమానాలు కావాలి.. రాఫెల్లో ప్రయాణించిన ఐఏఎఫ్ చీఫ్
భారత, ఫ్రెంచ్ వైమానిక దళాలు సంయుక్తంగా మంగళవారం జోధ్పూర్లో గరుడ ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించాయి. మన వైమానిక దళాన్ని ఆధునీకరించాలని, దీని కోసం మన దళంలోకి 4.5 జనరేషన్కు చెందిన యుద్ధ విమానాలు అవసరం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ అన్నారు.
భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు సంయుక్త విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఇరు దేశాలు కలిసి 'గరుడ VII' విన్యాసాలను నిర్వహించాయి.ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి , పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణించారు. అదే సమయంలో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ స్టీఫెన్ మిల్లీ రష్యాకు చెందిన సుఖోయ్-30 ఫైటర్ జెట్లో ప్రయాణించారు.
ఈ సందర్బంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ… భారత వైమానిక దళాన్ని ఆధునీకరించాలని, దీని కోసం మన దళంలోకి 4.5 జనరేషన్కు చెందిన యుద్ధ విమానాలు అవసరం ఉందన్నారు.మన వైమానిక దళం యొక్క ఆవశ్యకత ప్రకారం, మన జాబితాలో 4.5 తరం విమానాలను చేర్చడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
తక్షణ అవసరాలను తీర్చడానికి దళంలోకి ఐదు నుండి ఆరు స్క్వాడ్రన్ల (రాఫెల్)4.5 జనరేషన్కు చెందిన విమానాలు కావాలని అన్నారు.భవిష్యత్తులో (ప్రపంచంలో) ఎక్కడ ఏ సంఘర్షణ జరిగినా.. వైమానిక శక్తి గొప్ప పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదని,ఇటువంటి విన్యాసాలు(గరుడ) మన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. ఫ్రెంచ్ వైమానిక దళం కూడా రాఫెల్ను నడుపుతుందని, తాము కూడా రాఫెల్ను నడుపుతామని, అయితే.. తాము రాఫెల్తో అనేక ఇతర విమానాలను నడుపుతున్నామని ఎయిర్ఫోర్స్ చీఫ్ చెప్పారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ స్టీఫెన్ మిల్లీ మాట్లాడుతూ.. భారతీయ ఎయిర్క్రూతో కలిసి ముందుకు వెళ్లడానికి ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ఈ విన్యాసాల వల్ల ఇరుదేశాల శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చని అన్నారు. 'గరుడ VII' విన్యాసాలు అక్టోబర్ 26న ప్రారంభం కాగా.. నవంబర్ 12న ముగుస్తుంది. ఇందులో రాఫెల్, తేజాస్, జాగ్వార్, సుఖోయ్-30 వంటి ముఖ్యమైన యుద్ధ విమానాలు ఉన్నాయి.