నేను ఆవు మూత్రం తాగుతా, అందుకే కరోనా రాలేదు: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
ఆవు మూత్రం తనను కరోనా నుండి రక్షించిందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్పారు. ప్రతి రోజూ తాను ఆవు మూత్రాన్ని తాగుతానని ఆమె తెలిపారు. ఆవు మూత్రం కరోనా నుండి కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి నయం చేస్తోందన్నారు.
న్యూఢిల్లీ: ఆవు మూత్రం తనను కరోనా నుండి రక్షించిందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్పారు. ప్రతి రోజూ తాను ఆవు మూత్రాన్ని తాగుతానని ఆమె తెలిపారు. ఆవు మూత్రం కరోనా నుండి కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి నయం చేస్తోందన్నారు.స్వదేశీ ఆవు మూత్రం తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నయం అవుతోందన్నారు. కరోనా రాకుండా తాను ఎలాంటి మందులు తీసుకోలేదన్నారు. ఆవు మూత్రం ఒక ప్రాణాలను రక్షిస్తోందని ఆమె చెప్పారు. రెండేళ్ల క్రితం ఆవు మూత్రంతో పాటు ఇతర ఆవు ఉత్పత్తుల విశ్రమాలు తనను క్యాన్సర్ నుండి దూరం చేసిందని ఆమె ప్రకటించారు.
కరోనా లక్షణాలతో ప్రగ్యా ఠాకూర్ 2020 డిసెంబర్ లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు ఆవు పేడ లేదా ఆవు మూత్రం సహాయపడుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. కరోనాకు వ్యతిరేకంగా ఆవుపేడ లేదా మూత్రం రోగనిరోధక శక్తిని పెంచుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ జె.ఎ. జయలాల్ మీడియాతో చెప్పారు. ఈ నెల మొదటి వారంలో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆవు మూత్రం కరోనా నుండి రక్షిస్తోందని ప్రకటించారు. తాను ప్రతిరోజూ ఆవు మూత్రాన్ని తాగుతానని ఆయన చెప్పారు. గత ఏడాది కరోనా ప్రారంభ సమయంలో బీజేపీ బెంగాల్ రాష్ట్ర చీఫ్ దిలీఫ్ ఘోష్ కూడ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆవు మూత్రాన్ని తాగుతానని చెప్పారు.