పొలం అమ్మి భార్యను టీచర్ చేస్తే.. హెడ్మాస్టర్తో పరార్.. ఆ కూలీకి షాక్
భర్త చాలా కష్టపడి భార్యను ఆమె ఇష్టప్రకారం టీచర్ జాబ్ కొట్టడంలో సహకరించాడు. ఆమె జాబ్ కొట్టింది. కానీ, టీచర్ అయిన తర్వాత హెడ్ మాస్టర్తో ఎఫైర్ పెట్టుకుని ఉడాయించింది. ఇద్దరు పిల్లల తల్లి అలా చేయడంతో ప్రేమ వివాహం చేసుకున్న భర్త షాక్ అయ్యాడు. ఈ ఘటన బిహార్లో చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: భార్య భర్తలు ఒకరి కోసం మరొకరు పాటుపడటం కామన్. ఒకరి వృద్ధిలో మరొకరు పాలుపంచుకుంటారు. కానీ, ఆ భర్త తనను మరిచి మరీ భార్య ఎదుగుదలకు పరితపించాడు. భార్య టీచర్ కావాలని కలలు కంటున్నదని తెలుసుకుని ఆమె కలను సాకారం చేయాలని కంకణం కట్టుకున్నాడు. తన భార్యను టీచర్ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. సొంత పొలాన్ని కూడా అమ్మేశాడు. ఆ భర్త కష్టానికి ప్రతిఫలం దక్కింది. భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చింది. కానీ, అసలు ట్విస్ట్ ఇప్పుడు ఎదురైంది. ఆ భార్య.. హెడ్ మాస్టర్తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆయనతోనే లేచిపోయింది. దీంతో ఆ భర్త ఖిన్నుడయ్యాడు. ఆమె పిల్లలు కూడా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది.
బిహార్లో వైశాలి జిల్లా మహీపుర గ్రామం జన్హడా పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి దినసరి కూలీ. 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి 12 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. భార్య టీచర్ కావాలని ఆరాటపడుతున్నదని తెలుసుకుని ఆ భర్త సహకారం అందించాడు. అందుకోసం సొంత పొలంలో కొంత భాగాన్ని అమ్మేశాడు కూడా. ఆమెకు గతేడాదే టీచర్ ఉద్యోగం వచ్చింది.
అంతా అనుకున్నట్టే సాగుతున్నదని అనుకున్న తరుణంలో ఆమె భర్తకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. హెడ్మాస్టర్తో తన భార్యకు అఫైర్ ఉన్నదని తెలుసుకుని ఆ వ్యక్తికి తలతిరిగిపోయింది. ఆయనకే కాదు.. వారి పిల్లలకు కూడా ఆమె చేసిన పని రుచించడం లేదు. వారంతా ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తేదీలపై విపక్షాల అభ్యంతరం.. గణేశ్ చతుర్ధినాడు సమావేశమని మండిపాటు
ఇక పై తమకు ఆ తల్లి వద్దని, ఆమె ఇంటికి రాకూడదని ఆ పిల్లలు కోరుకుంటున్నారు. తన తల్లి మంచిది కాదని ఏడేళ్ల బాలుడు చెబుతున్న విషయాలకు సంబంధించిన వీడియో స్థానికులను కదిలించింది. ఇక ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని తన భార్య, హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేశాడు.