కట్టుకున్నవాడే కాటేసాడు... కర్ణాటకలో తెలుగు వివాహిత దారుణ హత్య
కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపాడో కసాయి భర్త. ఈ దారుణం కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ లో చోటుచేసుకుంది.

చిక్కబళ్లాపూర్ : కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా నరికిచంపాడో కసాయి భర్త. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మహిళ పొరుగురాష్ట్రం కర్ణాటకలో దారుణ హత్యకు గురయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లా హిందూపురంకు చెందిన అంజుంఖాన్, షానవాజ్ దంపతులు ఉపాధి నిమిత్తం కర్ణాటకకు వలసవెళ్లారు. చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు అలకకాపురంలో నివాసం వుండేవారు. సమీపంలోని ఓ ప్యాక్టరీలో ఇద్దరూ పనిచేసుకునేవారు.పెళ్లయి ఎనిమిదేళ్లయినా పిల్లలు కాకపోవడంతో భార్యాభర్త ఇద్దరే వుండేవారు.
అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇలా గత శుక్రవారం కూడా దంపతులు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చాకు తీసుకుని భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. అతడి తెలిపిన వివరాల ప్రకారం ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు రక్తపుమడుగులో పడివున్న మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త తరలించారు.
ఈ దారుణ హత్యపై హిందూపురంలోని మృతురాలు షానవాజ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆమె సోదరుడు జబీవుల్లా గౌరిబిదనూరు చేరుకుని సోదరి మృతదేహాన్ని స్వస్థతానికి తరలించాడు. సోదరి హత్యపై అతడు పోలీసులకు ఫిర్యాదుచేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరాడు.