జమ్మూ కాశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి కూలిన ఇళ్లు.. ఇద్దరు చిన్నారుల మృతి..
జమ్మూ కాశ్మీర్ లో కురిసిన భారీ వర్షాలు రెండు పసి ప్రాణాలను బలిగొన్నాయి. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో ఇళ్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఓ మట్టి ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ముత్తల్ ప్రాంతంలోని సమోల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కూలిపోయిన ఇంటి శిథిలాల నుంచి రెండు నెలల నుంచి మూడేళ్ల మధ్య వయసున్నఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశాయి. ఈ ప్రాంతంలోని అనేక ఇతర ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని రెస్క్యూ బృందం తెలిపింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అదే ప్రాంతంలో ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మృతుల కుటుంబానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘‘ఉధంపూర్లోని ముత్తల్ లో ఇల్లు కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాను ’’ అని ఎల్జీ తెలిపారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.