సైనికులకు అండగా నిలుద్దాం.. ప్రధాని మోదీ సందేశం
ఎంపీలంతా తమ డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చారని, ఎంపీలందరికీ తాను కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
యావత్ దేశం సైనికులకు అండగా నిలవాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ సంకేతాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ఇవ్వాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు.
చాలా భిన్నమైన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఒకవైపు కరోనా, మరో వైపు విధి నిర్వహణ ఉందని, కానీ ఎంపీలంతా తమ డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చారని, ఎంపీలందరికీ తాను కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యసభ, లోక్సభలు రెండు వేరువేరు సమయాల్లో జరుగుతాయని, శని-ఆదివారాల్లోనూ సమావేశాలు ఉంటాయని, దీనికి ఎంపీలందరూ ఆమోదం తెలిపినట్లు మోదీ చెప్పారు.
నోవల్ కరోనా వైరస్కు మందు రానంత వరకు నిర్లక్ష్యం వద్దు అంటూ మోదీ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. కరోనా వైరస్కు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వస్తే బాగుంటుందన్నారు. మన శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ తయారీలో సక్సెస్ సాధించినట్లు మోదీ తెలిపారు. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.
యావత్ దేశం మొత్తం సైనికుల వెంటే ఉందన్న సంకేతాన్ని పార్లమెంట్ సభ్యులు వినిపిస్తారని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.