పీఎఫ్ఐ, ఉగ్రవాద అనుమానిత చర్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం
Home Minister Amit Shah: ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఈడీ, ఎన్ఐఏ దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన సభ్యులను, వారితో సంబంధం కలిగిన వారిని అరెస్టు చేశారు.
National Investigation Agency Raids: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు, ఉగ్రవాద అనుమానితులపై చర్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన ఉన్నతాధికారుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన సభ్యులు, ఉగ్రవాదులపై తీసుకున్న చర్యలను షా పరిశీలించినట్లు ఒక అధికారి తెలిపారు.
కాగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో NIA నేతృత్వంలోని బహుళ-ఏజెన్సీ ఆపరేషన్ ను నిర్వహించింది. 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ అరెస్టు చేసింది. అత్యధికంగా కేరళ (22) అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అస్సాం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, ఢిల్లీ ( ముగ్గురు చొప్పున), రాజస్థాన్ (2)లో అరెస్టులు జరిగాయి.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, నిషేధిత సంస్థల్లో చేరడానికి ప్రజలను రాడికలైజ్ చేయడంలో నిమగ్నమైన వ్యక్తుల నివాస, అధికారిక ఆవరణల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 200 మందికి పైగా ఎన్ఐఏ, ఈడీ సభ్యుల బృందం ఇందులో పాల్గొన్నారు.
‘‘ కేరళలోని పీఎఫ్ఐకి చెందిన వివిధ కార్యాలయాలపై ఎన్ఐఏ, ఈడీ దాడులు నిర్వహించాయి. 50 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.’’ అని పీఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ అబ్దుల్ సత్తార్ తెలిపారు.