గాడ్సేకి పూజలు.. గాంధీకి అవమానం
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకి హిందూ మహాసభ సభ్యులు పూజలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకి హిందూ మహాసభ సభ్యులు పూజలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటాన్ని తుపాకీతో కాలుస్తూ.. హిందూమహాసభ సంస్థ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గాడ్సే చిత్రపటానికి పూజలు నిర్వహించి.. నివాళులర్పించారు.
అఖిల భారత హిందూ మహాసభ.. మహాత్మాగాంధీ విషయంలో గతంలోనూ ఇలాంటి వైఖరిని ప్రదర్శించింది. గ్వాలియర్ లో ప్రత్యేకంగా హిందూ మహాసభ ఆధ్వర్యంలో నాథూరాం గాడ్సే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అలాగే దౌలత్గంజ్లో గాడ్సేకు గుడి కట్టడానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ గుడి నిర్మాణం కోసం భూమి కేటాయించాలని అప్పట్లో హిందూ మహాసభ గ్వాలియర్ జిల్లా యంత్రాగాన్ని కోరింది. కాగా.. వారి వినతిని జిల్లా యంత్రాంగం తిరస్కరించింది.
తాజాగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో గాంధీని అవమానించే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. హిందూమహాసభ సంస్థ నిర్వాహకులు చేసిన కార్యక్రమం పట్ల సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.