హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కాంగ్రెస్ లిస్ట్ ఇదే.. !
Dharamshala: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం 46 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.
Himachal Pradesh Assembly Elections: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 62 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. అంతకు ముందు రోజు కాంగ్రస్ కూడా 46 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, సీనియర్ నేత అనిల్ శర్మ, సత్పాల్ సింగ్ సత్తి పేర్లు జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. సీఎం జైరాం రాకూర్ సెరాజ్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, అనిల్ శర్మ మండి నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో సీనియర్ నాయకుడు సత్పాల్ సింగ్ ఉనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కొత్తగా ఏర్పాటైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు మంగళవారం తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ థియోగ్ నుంచి, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు నదౌన్ నుంచి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ముఖేష్ అగ్నిహోత్రి హరోలీ నుంచి, మాజీ మంత్రి ఆశా కుమారి డల్హౌసీ నుంచి, మాజీ మంత్రి కౌల్ సింగ్ దరాంగ్ నుంచి పోటీ చేయనున్నారు.
మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఖిమి రామ్ చంబా స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇతర ప్రముఖ అభ్యర్థులలో జవాలి నుండి చందర్ కుమార్, షాపూర్ నుండి కేవల్ సింగ్ పఠానియా, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సోలన్ నుండి ధని రామ్ షాండిల్, షిల్లై నుండి హర్షవర్ధన్ చౌహాన్ మరియు సిమ్లా (రూరల్) నుండి విక్రమాదిత్య సింగ్ ఉన్నారు.
68 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 25 కాగా, పత్రాల పరిశీలన అక్టోబర్ 27న జరుగుతుంది. పత్రాల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 29గా పేర్కొన్నారు. నవంబర్ 12 పోలింగ్ జరగ్గా.. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో అధికార బీజేపీకి 43 మంది, కాంగ్రెస్కు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు.