ముస్లింల పవిత్ర గంథ్రం విద్యకు ప్రాధాన్యం ఇచ్చిందని, హిాజాబ్ కు కాదని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆయన రెండో సారి స్పందించారు. ముస్లింలు చదువుకోవాలని సూచించారు.
హిజాబ్ (hijab) వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. కర్నాటకలో మొదలైన ఈ హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. మళ్లీ తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Assam CM Himanta Biswa Sarma) హిజాబ్ వివాదంపై వ్యాఖ్యలు చేశారు. పవిత్ర ఖురాన్ (Quran) విద్యపై దృష్టి పెడుతుందని అన్నారు. విద్య, హిజాబ్ లో ఏది ముఖ్యమైనదో సరిగ్గా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ముస్లింల అతిపెద్ద బాధ్యత విద్యే అని సీఎం అన్నారు.
ఈ నెల 11వ తేదీన కూడా ఆయన హిజాబ్ వివాదంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడారు. ‘‘కర్ణాటక ఘటనతో దేశం పోరాడుతోంది, విద్యార్థి హిజాబ్ ధరించినట్లయితే (పాఠాలు) అర్థం చేసుకున్నాడో లేదో ఉపాధ్యాయుడికి ఎలా తెలుస్తుంది ? ముస్లిం సమాజానికి విద్య అవసరం కానీ హిజాబ్ కాదు ’’ అని అన్నారు. కర్నాటకలో హిజాబ్పై దుమారం రేగుతున్న నేపథ్యంలో అస్సాం సీఎం ఈ ప్రకటన చేశారు.
బుధవారం తెల్లవారుజామున బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ( Pragya Singh Thakur) కూడా ఈ విషయంలో మాట్లాడారు. మదర్సాలలో కాకుండా ఇతర విద్యాసంస్థల్లో హిజాబ్ ధరిస్తే సహించేది లేదని అన్నారు. మధ్యప్రదేశ్ బర్ఖేదా పఠానీ ప్రాంతంలోని ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ మీకు మదర్సాలున్నాయి. మీరు అక్కడ (మదర్సాలలో) హిజాబ్ ధరించినా, ఖిజాబ్ (జుట్టు రంగు) వేసుకున్నా మాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు అక్కడ అసవరమైన డ్రెస్ వేసుకోండి. అక్కడ సూచించిన క్రమ శిక్షణను పాటించండి. కానీ మీరు దేశంలోని పాఠశాలలు, కళాశాలల విజ్ఞానాన్ని, క్రమశిక్షణను వక్రీకరించి హిజాబ్ ధరించడం, ఖిజాబ్ను ఉపయోగించడం ప్రారంభిస్తే అది సహించరానిది. ’’ అని ఆమె చెప్పారు. హిందువులు మహిళలను పూజిస్తారని, వారిని చెడుగా చూడరని తెలిపారు.
ఇదిలా ఉండగా.. హిజాబ్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) రాష్ట్ర శాసనసభకు బుధవారం తెలిపారు. ప్రీ యూనివర్సిటీ కాలేజీలకు డ్రెస్ కోడ్ వర్తిస్తుందని, డిగ్రీ కాలేజీలకు కాదని ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ (Ashwath Narayan) నిన్న ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై జీరో అవర్ సమయంలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ( Siddaramaiah) వివరణ కోరారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు.
ఉడిపి (udipi)లోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం గత నెలలో మొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణ చేపడుతోంది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థుల ఎవరూ మత పరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు (high court) ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
