ప్రముఖ పాకిస్తాన్ న్యూస్ వెబ్ సైట్ 2014లో ప్రచురించిన ఓ స్టోరీలో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా కు సంబంధించిన పాత ఫొటో ఉంది. అయితే ఆ ఫొటోలో ఉన్న మహిళలు ఎవరూ హిజాబ్ ధరించి కనిపించడం లేదు. దీనిని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
కర్నాటక (karnataka)లోని ఉడిపి (udipi)లో వెలుగులోకి వచ్చిన హిజాబ్ (hijab) వివాదం రోజు రోజుకు తీవ్రమవుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ హిజాబ్ ఆందోళనలు పాశ్చాత్య దేశాలతో పాటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ (pakistan) వరకు కూడా పాకింది.
భారతదేశ ఛార్జ్ డి అఫైర్స్ను పాకిస్తాన్ ఇస్లామాబాద్ (islamabad)లోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించింది. కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. భారతదేశంలోని ముస్లింలపై వ్యక్తం చేస్తున్నమతపరమైన అసహనం, వివక్షపై పాకిస్తాన్ ‘‘తీవ్రమైన ఆందోళన’’ గా భారత దౌత్యవేత్తకు తెలియజేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గత వారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నాటకలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ముస్లిం మహిళల భద్రత, శ్రేయస్సుకు కృషి చేయాలని తెయాలని ఆ ప్రకటనలో పేర్కొంది.
అయితే మన భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకున్న పాకిస్తాన్ కు తన చరిత్ర పుటలను పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రముఖ పాకిస్థాన్ వైబ్ సైట్ అయిన డాన్ (Dawn) న్యూస్లో 2014లో పబ్లిష్ అయిన ఓ స్టోరీలో మతపరంగా దేశ విభజనకు కారణమైన ముహమ్మద్ అలీ జిన్నా (Muhammad Ali Jinnah) ఫొటోను చూపించారు. ఇందులో ముహమ్మద్ అలీ జిన్నా, ఆల్ ఇండియా ముస్లిం మహిళా విభాగం సభ్యులతో కూర్చొని కనిపిస్తున్నారు. ఇందులో ఉన్న మహిళలు ఎవరూ కూడా హిజాబ్ ధరించి కనిపించడం లేదు.
డాన్ వెబ్ సైట్ ప్రచురించిన ఈ స్టోరీ వివిధ రకాల ఆకుపచ్చ రంగులు- ముస్లిం లీగ్ (Muslim League) సైద్ధాంతిక చరిత్ర తెలుపుతోంది. దీని ప్రకారం ప్రస్తుతం కొంతమంది చెబుతున్నట్టుగా, పాకిస్తాన్ సూచించినట్టుగా.. ఇస్లామిక్ దేశంలో కూడా బాలికలకు హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టంగా రుజువు చేస్తోంది. అయితే హిజాబ్ విషయంలో భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ముందు పాకిస్తాన్ తన సొంత చరిత్రలోనే గుర్తు తెచ్చుకోలేదు.
డాన్ పబ్లిష్ చేసిన ఈ స్టోరీలోని మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ ఇస్లామిక్ పాకిస్థాన్ని సృష్టించేందుకు భారత్ ను విభజించిన ముస్లిం పార్టీ. దాని వ్యవస్థాపకుడు జిన్నా గతం’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘‘ పాకిస్థాన్ డాన్ లో పబ్లిష్ అయిన ఈ ఫొటోలో ఆయన పార్టీలోని మహిళా విభాగంలోని ముస్లిం మహిళలు అందరూ సంప్రదాయ హిజాబ్ ధరించి ఉన్నారు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
