Asianet News TeluguAsianet News Telugu

ఏడాది నుంచి నా భర్తకు దూరంగానే ఉన్నాను.. హేమమాలిని

నిజానికి గతేడాది లాక్‌ డౌన్‌ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు.

Hema Malini On Staying Away From Dhamendra Amid COVID Pandemic: 'Its Best For His Safety'
Author
Hyderabad, First Published May 5, 2021, 8:01 AM IST

తాను తన భర్త నుంచి దాదాపు సంవత్సరంపాటు దూరంగా ఉంటున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని పేర్కొన్నారు. తన భర్త ధర్మేంద్రకు తాను దూరంగా ఉండటానికి కరోనా మహమ్మారి కారణమని ఆమె చెప్పారు. కరోనా కారణంగా ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించగా... తామిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండిపోయామని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దగ్గరగా ఉండటం కన్నా.. దూరంగా ఉంటేనే క్షేమంగా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. నిజానికి గతేడాది లాక్‌ డౌన్‌ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు.

ఈ విషయం గురించి హేమ మాలిని మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండటం అవసరం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన్ను (ధర్మేంద్ర) మేం కలవడంకన్నా ఆయన ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం. వందేళ్ల మానవ చరిత్రలో ఇంత పెద్ద అంటువ్యాధిని మనం ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. సమాజాన్ని కాపాడుకోవాలంటే.. మనం ధైర్యంగా నిలబడాలంటే మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిందే. ఈ త్యాగం చేయాలి’’ అన్నారు.

 ధర్మేంద్ర వయసు దాదాపు 85. హేమకు 70 ఏళ్లు పైనే. ఈ కరోనా టైమ్‌లో వయసు పైబడినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇంటిపట్టునే ఉండాలి. అందుకే ధర్మేంద్ర–హేమ ఇలా దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకి పెళ్లయి, ఇద్దరు కుమారులు సన్నీ, బాబీ డియోల్‌ ఉన్నారు. ధర్మేంద్ర–హేమకు ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్‌ ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios