Heavy rains: ఉత్తరాఖండ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు పౌరీలో ఓ ముఖ్యమైన వంతెన కూలిపోయింది. మలన్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్లోని కోట్ద్వారాలోని మలన్ నది ఉగ్రరూపం దాల్చింది. పొంగిపొర్లుతున్న మలాన్ నదిపై నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది.
Heavy rains lash Uttarakhand: భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలోని అనేక నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయి కంటే దాదాపు మూడు మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండగా, ఉత్తరాఖండ్లోని కోట్ద్వారాలోని మలన్ నది ఉగ్రరూపం దాల్చింది. పొంగిపొర్లుతున్న మలాన్ నదిపై నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షపాతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కోటద్వారాకు సంబంధించిన ఒక భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలన్ నదిలో తీవ్రమైన నీటి ప్రవాహాం క్రమంలో ఇక్కడి వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది.
ఉత్తరాఖండ్ లో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, పరిపాలన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ ప్రజలకు సహాయం చేయాలని, వరదలో ఎవరూ చిక్కుకోకుండా చూడాలని ఆదేశించారు. "ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసరాలు అందేలా చూడాలని ఆదేశించారు. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, అధికార యంత్రాంగం అధికారులతో సమావేశం నిర్వహించానని... ప్రజలకు సహాయం చేయాలనీ, వరదల కారణంగా చిక్కుకున్న వారికి ఆహారం, ఇతర అవసరమైన వస్తువులు అందేలా చూడాలనీ, రోడ్లను త్వరగా క్లియర్ చేయాలని నేను ప్రతి ఒక్కరినీ ఆదేశించాను" అని పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. ఉత్తరాఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్ వరదలు.. జూలై 15 వరకు పలు రైళ్లు రద్దు
ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. మొత్తం 600 మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, 500కు పైగా ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటిలో కొన్ని రద్దయ్యాయనీ, మరికొన్ని దారి మళ్లించామని చెప్పారు. మరికొన్ని షార్ట్-ఎండ్ కావడంతో పాటు పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
