ఢిల్లీలో భారీ వర్షం.. విమానయాన సేవలకు అంతరాయం.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
నేటి తెల్లవారుజామున ఢిల్లీలో బలమైన ఈదురు గాలులతో కూడి వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. విమాన సేవలు రద్దు అయ్యాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరి కొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఈ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో విమానయాన కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అనేక విమానయాన సంస్థల సేవలు నిలిచిపోయాయి.
వర్షాల కారణంగా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి. ఎయిర్ పోర్టు కు వచ్చే ముందు సర్వీసుల స్టేటస్ చూసుకొని బయలుదేరాలని అభ్యర్థించాయి. కాగా రాబోయే రెండు గంటల పాటు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షపాతం కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ‘‘ ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. తాజా సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్ను సంప్రదించాలని కోరుతున్నాం’’ అని ట్వీట్ చేసింది.
అయితే అంతకు ముందు చేసిన ట్వీట్లో ఉరుములతో కూడిన తుఫాను కారణంగా కచ్చా గృహాలు, పాత నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. కొన్ని గంటల పాటు ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాలలో గంటకు 60-90 కిలో మీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షం, 60-90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది.
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు, బలమైన గాలులకు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి, దీని ఫలితంగా రోడ్లు బ్లాక్ అయ్యాయి. వర్షాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల వీలైతే ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ప్రయాణానికి దూరంగా ఉండాలని సూచించింది. అయితే ఉదయం చాలా మంది ఢిల్లీ వాసులు తమ వర్షపు అనుభావాలపై ట్వీట్లు చేశారు.