Heavy rains: ముంబయిలో భారీ వర్షాలు.. నాగ్పూర్, వార్దాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
weather update: జూన్లో మహారాష్ట్రలో 147.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతంలో 70 శాతం అని IMD డేటా వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Maharashtra: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాతాలు నీటమునిగాయి. బుధవారం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ సంవత్సరం రుతుపవనాల సీజన్ ప్రారంభం నుండి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD).. నాగ్పూర్, భండారా, వార్ధాతో సహా విదర్భలోని అనేక ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో పసుపు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, బుధవారం (ఆగస్టు 10) కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ఐఎండీ.. నాగ్పూర్, వార్ధా, చంద్రపూర్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు సోమవారం ఉదయం నుంచి ముంబయిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వరద నీటికి తొలగింపు చర్యలు చేపట్టారు. విస్తృతంగా వానలు పడుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మహారాష్ట్రలో గణనీయమైన ప్రాంతాన్ని కలిగి ఉన్న పశ్చిమ తీరం, పశ్చిమ మధ్య భారతదేశంలో రాబోయే రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఇక ఆదివారం నాడు ఐఎండీ విడుదల చేసిన ఓ నివేదిక వివరాల ప్రకారం ఈ సంవత్సరం రుతుపవనాల సీజన్ నిస్తేజంగా ప్రారంభమైనప్పటికీ, జూన్, జూలై నెలల్లో మహారాష్ట్రలో సాధారణం కంటే 27 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయని పేర్కొంది.
IMD పేర్కొన్న డేటా ప్రకారం జూలై 31 వరకు రాష్ట్రంలో 677.5 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ గణాంకాల కంటే 27 శాతం ఎక్కువ అని IMD సీనియర్ అధికారి తెలిపారు. సాధారణంగా జూన్ 7న రాష్ట్రానికి వచ్చే నైరుతి రుతుపవనాలు జూన్ 11 వరకు ఆలస్యమై నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. “జూన్ చివరి నాటికి, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని రాష్ట్ర సంచిత వర్షపాత గణాంకాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, తీవ్రత బాగా పెరిగింది. జూలై చివరి నాటికి, రాష్ట్రంలో అదనంగా భారీ వర్షాలు కురిశాయి” అని అధికారి తెలిపారు.
జూన్లో మహారాష్ట్రలో 147.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతంలో 70 శాతంగా ఉందని ఐఎండీ డేటా వెల్లడించింది. "మరాఠ్వాడా ప్రాంతంలో సాధారణం కంటే 61 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విదర్భ, మధ్య మహారాష్ట్రలో 25, 39 శాతం ఎక్కువ వర్షాలు నమోదయ్యాయి. కొంకణ్లో 6 శాతం అధిక వర్షపాతం నమోదైంది’’ అని తెలిపారు.