Kerala: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.
IMD-red alert: ఈ వారం ప్రారంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు పొటెత్తాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం పెద్దమొత్తంలో సంభిస్తున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరో రెండు రోజులు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతారణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ముల్లపెరియార్, ఇడుక్కితో సహా పలు ప్రాంతాల్లో ఉన్న డ్యామ్లలో నీటి మట్టాలు వాటి నిల్వ సామర్థ్యాలకు చేరుకుంటున్నాయి. మరికొన్ని జలాశయాలు రెడ్ అలర్ట్ స్థితికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కిలోని పొన్ముడి, కల్లార్కుట్టి, ఎరట్టయార్, లోయర్ పెరియార్, కోజికోడ్లోని కుట్టియాడి, అలాగే, పతనంతిట్ట జిల్లాల్లోని మూజియార్లలో ఉదయం 11.00 గంటలకు నీరు రెడ్ అలర్ట్ స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (KSDMA) అందించిన గణాంకాల ప్రకారం ఆరు డ్యామ్లలో నీరు రెడ్ అలర్ట్ స్థాయిలకు చేరుకున్నాయి. వాటిలో నాలుగు ఇడుక్కిలో ఉన్నాయి.
అలాగే, ముల్లపెరియార్ డ్యామ్లో గత కొన్ని గంటలుగా వర్షపాతం తగ్గుదల కారణంగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 135.7 అడుగుల వద్ద నీటి మట్టం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఎటువంటి హెచ్చరికలు జారీ చేయబడలేదని తెలిపారు. ఇడుక్కి జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారి అన్నారు. ఇడుక్కి డ్యాం వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని, అయితే ప్రస్తుతం అక్కడ వర్షపాతం తగ్గుముఖం పట్టడం వల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారి తెలిపారు.
కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు, వరదముంపు ప్రాంతాల కారణంగా అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈదురు గాలులు, భారీ వర్షాలకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలోని పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధకారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రస్తుత పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని, కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిమట్టాలు పెరుగుతున్నందున వివిధ నదుల ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారీ వర్షాలు క్రమంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
