హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలో సోమవారం భారీ వర్షం కారణంగా శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో శివాలయం నేలమట్టం అయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ప్రమాద సమయంలో అక్కడ 50 మంది వరకు ఉన్నారని.. ఉత్తర భారతంలో శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారని చెబుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దాదాపు 25 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘటన స్థలానికి చేరుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందం.. సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు ఘటన స్థలంలో తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలం నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారని.. శిథిలాలను తొలగించి చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఇక, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌ సోలన్‌లోని జాదోన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలను ఆగస్టు 14 వరకు మూసివేస్తున్నట్లుప్రభుత్వం ప్రకటించింది. స్థానిక వాతావరణ కేంద్రం.. ఆగస్టు 14 నుండి 17 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.