భారత్ లో కరోనా డేంజర్ బెల్స్.. రానున్న 40 రోజులు చాలా కీలకం..
భారతదేశంలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గతంలో కొవిడ్ విజృంభించిన తీరును పరిశీలించి చూస్తే.. వచ్చే జనవరి నెలలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 40 రోజులు చాలా కీలకమని తెలిపాయి.
భారతదేశంలో కరోనా డేంజర్ బెల్స్: ప్రస్తుతం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే.. గతంలో కొవిడ్ విజృంభించిన తీరును పరిశీలించి చూస్తే.. జనవరి మధ్యకాలం నాటికి భారతదేశంలో మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నదనీ, దీంతో రాబోయే 40 రోజులు చాలా కీలకమని ప్రభుత్వ వర్గాలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. Omicron సబ్-వేరియంట్ BF.7 విజృంభిస్తే.. కేసులు అకస్మాత్తుగా పెరగవచ్చని అంచనా వేశాయి.
ఇది కాకుండా నాసికా వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి నెల రోజులు పడుతుందనీ, ఈసారి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసే అవకాశం లేదు. కేసుల సంఖ్య పెరిగినా.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం BF.7 వేరియంట్పై వ్యాక్సిన్ ప్రభావం పరిశోధించబడుతుంది. కరోనాకు సంబంధించి తదుపరి 35 నుండి 40 రోజులు ముఖ్యమైనవని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులో పెట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ కూడా దుబాయ్ నుంచి తమిళనాడుకు వచ్చిన ఇద్దరిలో కరోనా మహమ్మారిని గుర్తించారు. చెన్నై ఎయిర్పోర్టులో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
ఇవాళ్టి రెండు కేసులతో కలిపి డిసెంబర్ 24 నుంచి 26 మధ్య దేశంలో కరోనా బారినపడిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 39కి చేరింది. మొత్తం 498 విమానాల నుంచి 1780 మంది శాంపిల్స్ సేకరించారు. అందులో 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 188 మంది కొవిడ్ బారినపడ్డారు. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,468కి చేరింది. గత రెండు రోజుల్లో విమానాశ్రయాల్లో 6000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్గా తేలింది.
ఒక అధికారి మాట్లాడుతూ, "గతంలో, తూర్పు ఆసియా కోవిడ్ -19 బారిన పడిన 30-35 రోజుల తర్వాత మహమ్మారి యొక్క కొత్త తరంగం భారతదేశాన్ని తాకినట్లు కనుగొనబడింది. ఇది ఒక ధోరణి." అని అధికారి చెప్పారు. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త కోవిడ్ వేవ్ విజృంభించినప్పటికీ.. మరణాల రేటు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు.
కరోనా పరీక్ష తప్పనిసరి కావచ్చు
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. త్వరలో చైనాతో సహా 6 దేశాల నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు కరోనా పరీక్షను తప్పనిసరి చేసే అవకాశం ఉందని, విమాన సౌకర్యం, ఇతర నిబంధనలను అమలు చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. చైనాతో పాటు సింగపూర్, జపాన్, థాయ్లాండ్, దక్షిణ కొరియా,హాంకాంగ్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
కరోనా మాక్ డ్రిల్
COVID-19 కేసులలో ఏదైనా పెరుగుదలను ఎదుర్కోవటానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులు మంగళవారం మాక్ డ్రిల్లను నిర్వహించాయి. పరికరాలు, మానవ వనరుల కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేయడం చాలా ముఖ్యం అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఢిల్లీలో, LNJP ఆసుపత్రితో పాటు, కేంద్రం ఆధ్వర్యంలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి , దక్షిణ ఢిల్లీలోని అపోలో హాస్పిటల్తో సహా అనేక ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మాక్ డ్రిల్లు నిర్వహించబడ్డాయి.