దైవ సేవ కోసం.. ఉద్యోగాన్ని వదలుకున్న ఐపీఎస్ అధికారిణి
స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతీ అరోరా పంజాబ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి తాజాగా లేఖ రాశారు.
ఇంతకాలం ప్రజా సేవ చేశాను.. ఇక నుంచి దైవ సేవ చేసుకుంటానంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసింది. ఆమె వీర్ఎస్ కి అప్లై చేసినందుకు ఎవరూ షాకవ్వలేదు కానీ.. ఆమె చెప్పిన కారణం విని అందరూ షాకయ్యారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతీ అరోరా పంజాబ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి తాజాగా లేఖ రాశారు. ‘‘జీవితంలో అసలు లక్ష్యం దిశగా నా ప్రయాణం ప్రారంభిస్తాను. గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభూ, కబీర్ దాస్, తులసీ దాస్, వంటి వారు చూపించిన దారిలోనే ముందుకు వెళుతూ నా జీవితాన్ని కృష్ణపరమాత్ముడి సేవకు అంకితం చేస్తాను’’ అని భారతీ అరోరా తన లేఖలో పేర్కొన్నారు.
23 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగిన ఓ సీనియర్ అధికారి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం వైరల్గా మారింది. భారతీ అరోరా ప్రస్తుతం హరియాణాలోని అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ తన వృత్తి జీవితంలో ఆమె అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సంఝౌతా ఎక్సెప్రెస్ రైలు పేలుడు దర్యాప్తులోనూ ఆమె పాలు పంచుకున్నారు. ఇక పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2021లో ఆమె అంబాలా రేంజ్కు బదిలీ అయ్యారు. కాగా..రాజీనామా విషయమై మీడియా భారతీ అరోరాను సంప్రదించగా..ఉద్యోగం పట్ల తనకు అమితమైన ఆసక్తి ఉందని, ఈ బాధ్యతలు తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు గల కారణాలను తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు.