ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌కు ఉపశమనం, సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన కేసులో గుజరాత్‌లోని విరామ్‌గామ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్ ఐదేళ్ల నాటి కేసులో ఉపశమనం పొందారు. 2017లో జామ్‌నగర్‌లోని ధుతార్‌పూర్-ధుల్సియా గ్రామంలోని వివాదాస్పద ప్రసంగం కేసులో జామ్‌నగర్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనతో పాటు పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ కమిటీ (పాస్) కన్వీనర్ అంకిత్ ఘెడియాపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఘెడియా కూడా నిర్దోషిగా విడుదలయ్యాడు.

అసలేం జరిగిందంటే..?

గుజరాత్‌లో కొనసాగుతున్న పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా.. 4 నవంబర్ 2017న హార్దిక్ పటేల్ నేతృత్వంలో జామ్‌నగర్‌లోని దత్సియాలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేసిన రాజకీయ ప్రసంగం కారణంగా ఫిర్యాదు అందింది. పాస్ కోఆర్డినేటర్లు అంకిత్ ఘెడియా, హార్దిక్ పటేల్‌లపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన చివరి విచారణ ఈరోజు జామ్‌నగర్ కోర్టులో జరగగా ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో హార్దిక్ పటేల్ తరపు న్యాయవాది దినేష్‌భాయ్ విరానీ, రషీద్‌భాయ్ ఖిరా వాదనలను కోర్టు అంగీకరించింది.

హార్దిక్ పటేల్ ఎవరు?

పటీదార్ రిజర్వేషన్ ఉద్యమానికి పెద్దపీట వేసిన హార్దిక్ పటేల్ గుజరాత్‌లోని విరామ్‌గామ్ నివాసి. బి.కాం చదివారు. నాయకత్వం లక్షణాలు ఎక్కువ. పాటిదార్ ఉద్యమం తర్వాత అతడు కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరామ్‌గాం నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుజరాత్‌లో రెండు దేశద్రోహ కేసులు సహా పటేల్‌పై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి.

పాటిదార్ ఉద్యమం అంటే ఏమిటి?

పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం 25 ఆగస్టు 2015న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాటిదార్ కమ్యూనిటీ ప్రజల అతిపెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమం తర్వాత చాలా చోట్ల హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని పలు నగరాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది.

రాష్ట్రంలో అనేక హింసాకాండ , దహన సంఘటనలు కూడా జరిగాయి. 28 ఆగస్టు 2015న పరిస్థితి సాధారణమైంది, కానీ 19 సెప్టెంబర్ 2015న ఉద్యమం మరోసారి హింసాత్మక రూపం దాల్చింది. దీని తరువాత.. ప్రభుత్వం జనరల్ కేటగిరీ విద్యార్థులకు రాయితీలు, స్కాలర్‌షిప్‌లు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌లను ప్రకటించింది. 2016 ఆగస్టులో గుజరాత్ హైకోర్టు ఈ రిజర్వేషన్‌పై స్టే విధించింది.