140 కోట్ల జనాభాలో 100 మంది వద్దే దేశ సగం సంపద.. ఇందులో న్యాయం కనిపిస్తుందా? : రాహుల్ గాంధీ
Panipat: "దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అయితే, దేశ సంపదలో 50 శాతం కేవలం 100 మంది సంపన్నుల వద్ద ఉంది. ఇందులో మీకు న్యాయం కనిపిస్తుందా?.." అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 112 రోజులు పూర్తి చేసుకుందనీ, పానిపట్ లో తమకు ఘనస్వాగతం లభించిందని ఆయన పేర్కొన్నారు.
Congress Bharat Jodo Yatra: వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానా రెండో విడతలో భాగంగా శుక్రవారం ఉదయం పానిపట్ నుంచి ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ నుంచి గురువారం సాయంత్రం ఈ యాత్ర తిరిగి హర్యానాలోకి ప్రవేశించింది. రాత్రి విరామం తరువాత, యాత్ర పానిపట్ లోని కురార్ నుండి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశ ప్రజలను ఆలోచనలో పడేయడంతో పాటు దీనిపై కొత్త చర్చకు తెరలేపాయి. దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంది, అయితే, దేశ సంపదలో 50 శాతం కేవలం 100 మంది సంపన్నుల వద్దు ఉంది. ఇందులో మీకు న్యాయం కనిపిస్తుందా? అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 112 రోజులు పూర్తి చేసుకుందనీ, పానిపట్ లో తమకు ఘనస్వాగతం లభించిందని ఆయన పేర్కొన్నారు.
దేశ సగం సంపద 100 మంది ధనవంతుల వద్ద..
పానిపట్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "నా మదిలో ఒక ప్రశ్న ఉంది... దేశ జనాభా 140 కోట్లు. దేశంలోని మొత్తం సంపదలో 50 శాతం కేవలం 100 మంది ధనవంతులు మాత్రమే కలిగి ఉన్నారు... అందులో మీకు న్యాయం కనిపిస్తోందా? నరేంద్ర మోడీ భారత్ వాస్తవికత ఇదే' అని రాహుల్ గాంధీ కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని కార్పొరేట్ల లాభాలను చూస్తే 90 శాతం లాభం కేవలం 20 కార్పొరేట్ల చేతుల్లోనే ఉందని, ఈ దేశ సంపదలో సగం 100 మంది చేతుల్లో మాత్రమే ఉందని చెప్పారు. ఇది నరేంద్ర మోడీ భారత దేశ సత్యం అని ఆయన అన్నారు.
రెండు ఇండియాలు..
ఈ ప్రభుత్వం రెండు ఇండియాలను సృష్టించిందనీ, ఒక దేశంలో పేదలు, సామాన్యులు నివసించే ప్రాంతం కాగా, మరో దేశంలో 200-300 మంది ప్రజలు అన్ని సంపదలు కలిగిన మరో భారతదేశాన్ని సృష్టించారని బీజేపీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. "మీ దగ్గర ఏమీ లేదు. పానిపట్టులోని ఈ గాలిని మాత్రమే మీరు పీల్చుకోలేరు... ఇది క్యాన్సర్.. " అని ఆయన అన్నారు. పానిపట్ సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రంగా ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేశాయని, ఇది మొత్తం దేశం కథ అని గాంధీ అన్నారు. 'జీఎస్టీ, నోట్ల రద్దు దేశ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. 38 శాతం నిరుద్యోగంతో హర్యానా దేశంలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
అగ్నిపథ్ పై..
కేంద్ర అగ్నిపథ్ పథకానికి సంబంధించిన సమస్యలను కూడా గాంధీ లేవనెత్తారు. 'రాష్ట్ర శక్తి వృధా అవుతుంది. అగ్నివీర్ పాలసీ అంటే ఏమిటి? నాయకులు తమను అతిపెద్ద దేశభక్తులుగా చెప్పుకున్నారు. రైతులు, జవాన్ తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొంటారు. లక్షలాది మంది యువత త్రివర్ణ పతాకాన్ని రక్షించడానికి భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారు... కానీ ఇప్పుడు వారు నిస్సహాయంగా ఉన్నారు... భారత సరిహద్దులను పరిరక్షించడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 80,000 మంది యువకులను సైన్యంలో నియమించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అగ్నిపథ్ తో దేశ రక్షణ, మన
యువతతో చెలగాటం ఆడుతున్నదని ఆరోపించారు. నాలుగేళ్ల విరామం తర్వాత కేవలం 25 శాతం మందికి మాత్రమే రెగ్యులర్ ఉద్యోగాలు లభిస్తాయని, మిగిలిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతారని అన్నారు. తాను సైనికుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాస్తవాలు మరిచి తనను నిందిస్తున్నారని కూడా రాహుల్ గాంధీ అన్నారు.
తప్పుడు చట్టాలతో రైతులను ఇబ్బందులు పెట్టారు..
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను కూడా తీసుకువచ్చిందని తెలిపారు. అయితే, రైతులు ప్రభుత్వంపై పోరు సాగించచడంతో ప్రధాని తన తప్పును అంగీకరించాల్సి వచ్చిందని అన్నారు. రైతులు ఎత్తిచూపే వరకు ప్రధాని తన తప్పును తెలుసుకోలేకపోయారంటు మోడీపై విమర్శలు గుప్పించారు.