ఎస్యూవీ-బస్సు ఢీ.. ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది స్పాట్ డెడ్
road accident: గుజరాత్లోని నవ్సారిలో ఎస్యూవీ-బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుభూతి తెలిపారు.
SUV-bus collision in Gujarat's Navsari: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే తొమ్మిది మంద్రి ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్లోని నవ్సారిలో జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మరణించారు. అహ్మదాబాద్-ముంబై హైవేపై ఈ ప్రమాదం జరిగిందని నవ్సారి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీఎన్ పటేల్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని సూరత్ కు తరలించినట్లు పటేల్ తెలిపారు. ఎస్ యూవీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది, లగ్జరీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు నవ్సారి ఎస్పీ రుషికేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎస్యూవీలో ప్రయాణిస్తున్న వారు అంకలేశ్వర్ నివాసితులని తెలిపారు. వల్సాడ్ నుండి వారి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ప్రయాణికులు వల్సాద్కు చెందినవారని ఉపాధ్యాయ్ తెలిపారు.
కాగా, ఈ ఘటన గురించి తెలిసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'గుజరాత్లోని నవ్సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకమైనది. ఈ విషాదంలో తమ కుటుంబాలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు వారికి బాధను భరించే శక్తిని ప్రసాదించు గాక. గాయపడిన వారికి స్థానిక యంత్రాంగం తక్షణ చికిత్స అందిస్తోందనీ, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అమిత్ షా ట్వీట్ చేశారు.