'రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా...?' : గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారిన పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకులే నేరస్థులుగా మారుతున్న పరిస్థితిపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణగా, అండగా ఉండాల్సిన వారే దోపిడీకి పాల్పడితే ఎలా? అని ఘాటుగా స్పందించారు. రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న దంపతులపై పోలీస్లు దోపిడీకి పాల్పడిన ఘటనపై గుజరాత్ హైకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.
అహ్మదాబాద్లో ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు రాత్రి క్యాబ్లో ప్రయాణిస్తున్న జంట నుండి డబ్బు వసూలు చేశారు. గుజరాత్ హైకోర్టు సుయో మోటు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (సువో మోటు పిఐఎల్) విచారణ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులపై ఈ వ్యాఖ్య చేసింది.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి.మయిలతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. గుజరాత్లోని ఇతర నగరాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించింది. ట్యాక్సీలలో హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం అందేలా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి సునీతా అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షితంగా ఉన్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ అన్నారు. ఇక్కడ నేరస్థుల గురించి కాదు. కాపలాదారులే నేరస్తులయితే.. ఈ పరిస్థితి గురించి తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. గుజరాత్ అత్యంత సురక్షితమైన రాష్ట్రమని ప్రభుత్వ న్యాయవాది మనీషా లవ్కుమార్ షా ధర్మాసనానికి తెలిపారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మరుసటి రోజే ట్రాఫిక్ అధికారులు, టీఆర్బీ జవాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అరెస్ట్ చేశామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని న్యాయవాది మనీషా లవకుమార్ షా తెలిపారు. TRB జవాన్ సర్వీస్ రద్దు చేయబడింది. అన్ని పోలీస్స్టేషన్ల ఇన్చార్జి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు షా తెలిపారు. సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణను గడువులోగా పూర్తి చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20న జరగనుంది.
అసలేం జరిగింది?
అహ్మదాబాద్ పోలీసులు, ఓ హోం గార్డు కలిసి అర్ధరాత్రి దంపతులను బెదిరించి రూ.60 వేలు వసూళ్లకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దాఖలైన పిల్ను గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 20న జరగనున్న తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయిలో దర్యాపు చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.