గుజరాత్ మాజీ మంత్రిని ఢీకొట్టిన గోవు.. తిరంగా యాత్ర చేపడుతుండగా ఘటన
తిరంగా యాత్ర చేపడుతుండగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ను వేగంగా దూసుకొచ్చిన ఓ గోవు ఢీకొట్టింది. దీంతో ఆయన ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. ఆయన ఎడమ కాలు స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు చెప్పారు.
అహ్మదాబాద్: గుజరాత్లో తిరంగా యాత్ర చేపడుతుండగా.. మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ను వేగంగా దూసుకొస్తున్న ఓ గోవు ఢీకొట్టింది. మెహెసానా జిల్లా కాడి టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ ఘటనలో మాజీ మంత్రి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
సుమారు 2000 మందితో మెహెసానా జిల్లాలో తిరంగా యాత్ర చేపడుతున్నారు. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 70 శాతం పూర్తి చేసుకుంది. మరో 30 శాతం వెళితో యాత్ర పూర్తి కాబోతుంది అనగా మార్కెట్ సమీపానికి వచ్చిన సందర్భంలో ఓ గోవు వేగంగా పరుగెత్తుకుంటూ ఆ యాత్ర వైపు దూసుకొచ్చింది. ఎక్కడ ఆగకుండా అంతే వేగంగా యాత్ర చేపడుతున్న వారిపైకి దూసుకుపోయింది. ఇందులో మాజీ మంత్రి నితిన్ పటేల్ గాయపడ్డారు. ఆ గోవు అందరినీ ఢీ కొంటూ ముందుకు వెళ్లింది. ఇందులో మాజీ మంత్రి నితిన్ పటేల్ కూడా నేల మీద పడిపోయాడు.
వెంటనే మాజీ మంత్రి నితిన్ పటేల్ను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఎక్స్ రే, సీటీ స్కాన్ తీశారు. నితిన్ పటేల్ ఎడమ కాలు స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్టు వివరించారు. చికిత్స చేసిన వైద్యులు తనను 20 నుంచి 25 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టు పేర్కొన్నారు.
విజయ్ రూపానీ ప్రభుత్వ హయాంలో నితిన్ పటేల్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రిగా చేశారు.