సారాంశం

Election Campaign: గుజరాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం బీజేపీ భారీ ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ఏకంగా ఒక్క‌రోజే 56 బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డంతో పాటు ఆయా స‌భ‌ల్లో బీజేపీ అగ్ర‌నాయ‌కులు పాలు పంచుకుని ఎన్నిక‌ల  ప్ర‌చారం చేశార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Gujarat Assembly Election 2022: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు అక్క‌డి రాజ‌కీయాల‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు ఓట‌ర్ల‌ను త‌మవైపున‌కు తిప్పుకోవ‌డానికి అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ మ‌రోసారి అధికారం పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. దీని కోసం ముందున్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం దూకుడుగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏకంగా ఒక్క‌రోజే 56 బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డంతో పాటు ఆయా స‌భ‌ల్లో బీజేపీ అగ్ర‌నాయ‌కులు పాలు పంచుకుని ఎన్నిక‌ల  ప్ర‌చారం చేశార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా 26 మంది జాతీయ నాయకులు ఆయా బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించారు.

కచ్ జిల్లాలోని అబ్దాసా నియోజకవర్గంలో జరిగిన సభలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "కచ్ అభివృద్ధిలో బీజేపీ ఒక్క రాయిని వదలలేదు… జిల్లా నలుమూలలకు నర్మదా నీరు చేరుకుంది. దీని కారణంగా కచ్ ప్రజలు ఎల్లప్పుడూ బీజేపీతోనే ఉన్నారు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ముందుకు సాగుతున్నారు" అని పేర్కొన్నారు. అలాగే, ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆప్ వాగ్దానాల ప‌ట్ల ప్ర‌జ‌ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. వారు ఎప్పుడూ త‌ప్పడు వాగ్దానాలు ఇస్తార‌ని ఆరోపించిన శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్ర‌మే ఇచ్చిన హామీలను అమలు చేయగలడ‌నీ, మోడీ ఉంటే అన్నీ సాధ్యమేన‌ని పేర్కొన్నారు. 

కేజ్రీవాల్, కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీల‌పై విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ప‌దునుపెడుతూ.. వాళ్ల‌ను ఫలాలు ఇవ్వలేని చెట్లుగా అంటూ పేర్కొన్నారు. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ, భారతదేశం ఆయ‌న్ను ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, శ్యామ్‌జీ కృష్ణ వర్మ వంటి ఇతర స్వాతంత్య్ర సమరయోధుల పట్ల కనీస గౌరవం లేని జవహర్‌లాల్ నెహ్రూ గురించి మాట్లాడటం, ప్రశంసించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసున‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

 

అంక్లేశ్వర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ, ప్ర‌ధాని మోడీతోనే దేశంలో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన్నారు. "బీజేపీ, నరేంద్ర మోడీ మాత్రమే అభివృద్ధిని అందించగలరు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను మాత్రమే నమ్ముతాయి. సమ్మిళిత వృద్ధిని నమ్ముకున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రమే దేశం అభివృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గుజరాత్‌, కేంద్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, మన దేశంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి" అని జేపీ న‌డ్డా పేర్కొన్నారు.