Congress: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022 కోసం తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 104కు చేరుకుంది. ఇతర పార్టీల సైతం ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ప్రకటించాయి.
Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో అక్కడున్న ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022 కోసం తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 104కు చేరుకుంది. ఇతర పార్టీల సైతం ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ప్రకటించాయి.
వివరాల్లోకెళ్తే.. డిసెంబరు 1న జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తొమ్మిది పేర్లు ఉన్నాయి.. వారిలో ద్వారక నుండి మలుభాయ్ కండోరియా, తలాలా నుండి మాన్సిన్ దోడియా, కోడినార్ నుండి మహేష్ మక్వానా, భావ్నగర్ రూరల్ నుండి రేవత్సిన్హ్ గోహిల్, భావ్నగర్ ఈస్ట్ నుండి బల్దేవ్ మజీభాయ్ సోలంకిలను బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, బొటాడ్ స్థానం నుండి రమేష్ మోర్, జంబూసర్ నుండి సంజయ్ సోలంకి, భరూచ్ నుండి జయకాంత్ భాయ్ బి పటేల్, ధరమ్పూర్ నియోజకవర్గం నుండి కిషన్భాయ్ వేస్తాభాయ్ పటేల్ కూడా గుజరాత్ మొదటి దశ ఓటింగ్ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 104కు చేరుకుంది. ఎన్నికల కోసం 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ గత శుక్రవారం తన తొలి జాబితాను విడుదల చేసింది.
గురువారం నాడు 46 మంది పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. పార్టీ శుక్రవారం ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా, 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.
గుజరాత్ కాంగ్రెస్ మానిఫెస్టో
10 లక్షల ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అహ్మదాబాద్లో ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది.
