గుజరాత్ బ్రిడ్జీ కూలిపోవడం దైవేచ్ఛనే.. : కోర్టులో వంతెన మెయింటెనెన్స్ కంపెనీ మేనేజర్.. డీఎస్పీ ఏమన్నారంటే?
గుజరాత్ తీగల వంతెన కూలిపోవడాన్ని దైవేచ్ఛగా పేర్కొంటూ ఈ బ్రిడ్జీ రిపేర్ వర్క్ చేపట్టిన కంపెనీ మేనేజర్ కోర్టులో విస్మయకర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి ఇచ్ఛతోనే ఇది జరిగిందని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ, అదే కోర్టులో డీఎస్పీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్లో తీగల బ్రిడ్జీ కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వంతెన మెయింటెనెన్స్ పర్యవేక్షించాల్సిన కంపెనీ ఒరెవా మేనేజర్ ఈ రోజు కోర్టులో విస్మయకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన దైవేచ్ఛ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జీని రిపేర్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఆదివారం ఈ వంతెన కూలిపోయిన తర్వాత పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అందులో సెక్యూరిటీ గార్డు, టికెట్ కౌంటర్ సిబ్బంది సహా ఒరెవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఉన్నారు.
ఈ ఘటన గురించి చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఎంజే ఖాన్ వాదనలు విన్నారు. ఇందులో ఒరెవా మేనేజర్ దీపక్ పరేఖ్ మాట్లాడారు. ఇది భగవంతుడి ఇచ్ఛ అని తెలిపారు. అందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కాగా, మోర్బి డిప్యూటీ ఎస్పీ పీ ఝాలా కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జీ రెనోవేట్ చేసినప్పుడు తుప్పు పట్టిన కేబుళ్లను మార్చలేదని, వాటిని అలాగే ఉంచిందని ఆరోపించారు.
ఈ కేబుల్ బ్రిడ్జీని అక్టోబర్ 26న ప్రభుత్వ అనుమతి లేకుండా.. క్వాలిటీ టెస్ట్ చేయకుండానే రీఓపెన్ చేశారు.
‘మెయింటెనెన్స్, రిపేర్లో భాగంగా వీరు కేవలం బ్రిడ్జీ ప్లాట్ఫామ్ మాత్రమే మార్చారు. ఆ బ్రిడ్జీ మొత్తంగా తీగలపైనే ఆధారపడి ఉన్నది. అలాంటి ఆ తీగలకు ఆయిల్, గ్రీస్ పెట్టడం వంటివి చేయలేదు. ఈ కేబుల్ విరిగిన దగ్గర చూస్తే.. అవి తుప్పు పట్టి ఉన్నాయి. ఈ కేబుల్ను రిపేర్ చేసి ఉంటే.. ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు’ అని పోలీసు అధికారి కోర్టులో తెలిపారు.
అసలు ప్రభుత్వ మౌలిక వసతులను రిపేర్ చేసే అర్హతే ఈ కాంట్రాక్టర్లకు లేదని ఓ ప్రాసిక్యూటర్కు కోర్టుకు తెలిపారు. అయినా, వారే రిపేర్ చేశారని వివరించారు. వీరికి అర్హత లేకున్నా 2007లో మళ్లీ 2022లో వీరికే ఈ కాంట్రాక్టు ఇచ్చారని చెప్పారు.
ఈ సారి రిపేర్ చేసినప్పుడు బ్రిడ్జీ ఫ్లోరింగ్ కొత్తది వేయడంతో మరింత బరువు పెరిగింది. నాలుగు పొరల అల్యూమినియం షీట్లను ఈ ఫ్లోరింగ్ కోసం వినియోగించారు. కేబుల్స్ను పట్టించుకోకుండా ఈ ఫ్లోరింగ్ వేయడం వల్ల ప్రమాదం జరిగింది.
ఈ బ్రిడ్జీ రెనోవేషన్ పూర్తయిన తర్వాత కనీసం మరో 8 నుంచి 10 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జీ ఏ ఆటంకం లేకుండా ఉంటుందని ఒరెవా మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్బయ్ పటేల్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆయన కనిపించలేదు. చివరి సారి ఈ బ్రిడ్జీ రీఓపెనింగ్ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కనిపించారు.
అహ్మదాబాద్లోని ఒరెవా ఫామ్ హౌజ్కు తాళం వేసి వదిలిపెట్టబడి ఉన్నది. ఒరెవా టాప్ బాస్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదు. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన మోర్బి మున్సిపల్ అధికారుల పేర్లూ లేవు.
ఒరెవా గ్రూప్ మరో మేనేజర్ దీపక్ పరేఖ్, ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లు శనివారం వరకు పోలీసు కస్టడీలో ఉంటారు.