అసదుద్దీన్ ఒవైసీనికి నిరసన సెగ.. సభలో నల్లజెండాలు ప్రదర్శిస్తూ, మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు..
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వ్యతిరేకంగా కొందరు నల్లజెండాలు ప్రదర్శించారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వ్యతిరేకంగా కొందరు నల్లజెండాలు ప్రదర్శించారు. మోదీ.. మోదీ అంటూ నినాదాలు కూడా చేశారు. వివరాలు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఏఐఎంఐఎం అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ఒవైసీ అక్కడి చేరుకున్నారు.
ఆదివారం నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్యే వారిష్ పఠాన్తో కలిసి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో అసదుద్దీన్ ప్రసంగం మొదలుపెట్టగానే అక్కడున్నవారిలో నుంచి కొందరు యువకులు ప్రధాని మోదీ పేరుతో నినాదాలు చేశారు. ఒవైసీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల కిందట అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిందని ఎంఐఎం అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే.. అలాంటి సంఘటనేమీ జరగలేదని పోలీసులు తెలిపారు. ఎంఐఎం ప్రతినిధి ఆరోపణను ఖండించారు.
ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీగా పరిగణించబడుతున్నాయి. పోటీలో ఉన్న చిన్న పార్టీలలో ఎంఐఎం కూడా ఒకటి. మైనారిటీల ప్రాబల్యం ఉన్న కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం.. మరికొంతమంది అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం ఉంది.