కాలినడకన వెళ్తున్న భక్తుల పైకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి.. మరికొందరి పరిస్థితి విషమం..
గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం అరావళి జిల్లాలోని కృష్ణపుర్, మాల్పుర్ గ్రామాల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. మృతులు దాహోద్ జిల్లాలోని లిమ్ఖేడా, ఆరావళి జిల్లాలోని కృష్ణపుర్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.
గుజరాత్లోని ఆరావళి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు దాహోద్ జిల్లాలోని లిమ్ఖేడా, ఆరావళి జిల్లాలోని కృష్ణపుర్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారంతా ఆరావళిలోని బనస్కాంతలో అంబాజీ మాతను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి.. రోడ్డుపక్కన కాలినడకన వెళ్తున్న భక్తులపైకి వెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. కాగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడిచే వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించారు. పోలీసులు అన్ని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల విచారణ: సమాచారం అందుకున్న వెంటనే పోలీసు వాహనం ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. క్షతగాత్రుల వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
వాస్తవానికి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంబాజీలో సెప్టెంబర్ 5 నుంచి భదర్వి పూనం జాతర నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10 వరకు జాతర కొనసాగనుంది. ఈ జాతరకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బనస్కాంత జిల్లా యంత్రాంగం, అరసూరి అంబాజీ మాత దేవస్థాన్ ట్రస్ట్ గత కొన్ని రోజులుగా జాతర కోసం సన్నాహాలు చేస్తున్నారు.
కచ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఇటీవల గుజరాత్లోని కచ్ జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని నఖ్తరానా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో నఖ్తరానా నుండి మాండ్వి వైపు వెళుతుండగా దావ్డా గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, రెండేళ్ల బాలికతో పాటు మరో కుటుంబ సభ్యులు గాయపడ్డారు. మృతులను కస్తూర్బెన్ గోస్వామి (53), సంగీతాబెన్ గోస్వామి (25), పరేష్ గోస్వామి (50), మన్భర్ (3)గా గుర్తించారు.